ఈడీ హీట్‌.. సుప్రీంకోర్టుకు ఎమ్మెల్సీ కవిత

15 Sep, 2023 08:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విషయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత.. సుప్రీంకోర్టును కోరారు. కాగా, కవిత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. 

ఇ‍ప్పటికి మూడుసార్లు విచారణ..
ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం లేదా శనివారం విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. ఎమ్మెల్సీ కవితకు దర్యాప్తు సంస్థలు నోటీసులు జారీ చేయడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు ఈ ఏడాది మార్చిలో ఆమెకు ఈడీ వరుసగా నోటీసులు జారీ చేసింది. ఆ నెలలో 16, 20, 21వ తేదీల్లో మూడు సార్లు ఆమెను వివిధ అంశాలపై ప్రశ్నించింది. మరోవైపు గతేడాది చివర్లో లిక్కర్‌ కుంభకోణం అంశంలోనే సీబీఐ కూడా కవితను హైదరాబాద్‌లోని నివాసంలో విచారించింది. ఇప్పుడు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

నోటీసులపై కవిత సెటైర్లు..
అయితే, శుక్రవారం జరిగే ఈడీ విచారణకు దూరంగా ఉండాలని నిర్ణయించామని.. ఏం చేయాలన్నదానిపై తమ న్యాయ బృందం స్పందిస్తుందని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ఇదే సమయంలో ఈడీ నోటీసులపై సెటైరికల్‌ కామెంట్స్‌ కూడా చేశారు. రాజకీయ కక్షతోనే తనకు నోటీసులు పంపారని ఆరోపించారు. మళ్లీ రాజకీయం కోసమే పంపారు. ఇవి ఈడీ నోటీసులు కాదు.. మోదీ నోటీసులు. తెలంగాణలో నెలకొన్న రాజకీయ వాతావరణం, ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు మళ్లీ నోటీసులు పంపారు. తెలంగాణ ప్రజలు ఈ నోటీసులను సీరియస్‌గా తీసుకోవడం లేదు. అయితే బాధ్యత గల ప్రజాప్రతినిధిగా.. ఈ విషయాన్ని మా లీగల్‌ టీంకు చెప్పాం. వాళ్లు ఇచ్చే సలహాను బట్టి ముందుకు సాగుతాం. ఏడాది నుంచి కంటిన్యూగా నోటీసులు వస్తున్నాయి.. ఇదంతా టీవీ సీరియల్ లాగా సాగుతోంది విమర్శలు గుప్పించారు. 

ఇది కూడా చదవండి: ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు: కల్వకుంట్ల కవితకు విజయశాంతి సానుభూతి!

మరిన్ని వార్తలు