మునుగోడులో ఓటమితోనే మోదీ విషం చిమ్ముతున్నారు: జగదీశ్‌రెడ్డి

13 Nov, 2022 02:40 IST|Sakshi

నల్లగొండ: మునుగోడులో బీజేపీ ఓటమి పాలైందన్న అక్కసుతోనే ప్రధాని మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విషం చిమ్ముతున్నారని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఏడాది క్రితమే ప్రారంభమై ఎరువులు ఉత్పత్తి చేస్తున్న ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించేందుకు వచ్చిన మోదీ రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. నల్లగొండలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, ఎనిమిదేళ్లలోనే దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందనివిధంగా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. ఇతర రాష్ట్రాల మంత్రులు వచ్చి ఇక్కడి అభివృద్ధిని చూసి వెళ్తున్నారని తెలిపారు. తల్లిని చంపి పిల్లను తెచ్చారని..తెలంగాణ సరైన పద్ధతిలో రాలేదని తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా మోదీ మాట్లాడారని గుర్తు చేశారు. కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ను స్థాపించటంతో బీజేపీకి భయం పట్టుకుందన్నారు. మోదీ కుట్రలు తెలంగాణ ప్రజల ముందు సాగవన్నారు.
చదవండి: తెలంగాణ పట్ల అడుగడుగునా నిర్లక్ష్యమే.. రేవంత్ రెడ్డి ఫైర్‌

మరిన్ని వార్తలు