దళితబంధు దేశమంతా అమలుచేయాలని బీజేపీ, కాంగ్రెస్‌కు విజ్ఞప్తి

6 Aug, 2021 14:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దళితబంధు పథకం అమలు చేయడంపై మరో అంబేడ్కర్‌గా పోల్చి చెప్పారు. తన ఆలేరు నియోజకవర్గంలోని వాసాలమర్రిలో దళితబంధు ప్రారంభించడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దళితబంధులాంటి పథకం ఎవరు తీసుకురాలేదని.. అంత ధైర్యం ఎవరూ చేయలేదని మోత్కుపల్లి పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోత్కుపల్లి మాట్లాడుతూ.. దళితబంధును బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూడగలరా..? అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి దేశమంతా అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ పథకాన్ని ఆపాలని చాలా మంది చూస్తున్నారు, మన మీద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఒక సీనియర్ నాయకుడిగా ఒక రాజకీయ పార్టీకి రాజీనామా చేసి ప్రజల కోసం బయటికి వచ్చినట్లు తెలిపారు. డబ్బు తీసుకుని వస్తా అని చెప్పి తీసుకుని వచ్చిన మొగాడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. దళితులు ఇంకా బలహీన వర్గాలుగా ఉంచాలని చాలా మంది కుట్ర చేస్తున్నారని చెప్పారు. 

సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌లా సీఎం కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతారని చెప్పారు. మరియమ్మ ఘటన అయిన తరువాత కేసీఆర్ ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారని గుర్తుచేశారు. అలానే వరంగల్‌లో ఎస్సైపై అత్యాచారం కేసులో వెంటనే చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రజల కోసం బతికే నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. 
 

మరిన్ని వార్తలు