చంద్రబాబుకు పేదల గురించి మాట్లాడే హక్కే లేదు: నందిగం సురేష్

9 Aug, 2021 14:32 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: దళితుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, బాబు హయాంలో అమరావతి ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల కోసమే చంద్రబాబు దళితులను అడ్డుపెట్టుకుంటారని దుయ్యబట్టారు. ధర్నాలు, దీక్షలప్పుడే జనాలు ఉంటారని, బినామీల ఆస్తులు రక్షించుకోవడానికే ఉద్యమం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందన్నట్టుగా చంద్రబాబు డ్రామా చేస్తున్నారని, 53వేల మంది దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.

ఉద్యమం ఎందుకు? ఎవరికోసం చేశారో బాబుతో సహా అందరికీ తెలుసన్నారు. అమరావతి ప్రాంతం మురికివాడగా మారుతుందని బాబు ఆరోపించారని, దళితుల పట్ల చంద్రబాబుకు ఉన్న ప్రేమ దీనిబట్టే అర్ధం అవుతుందని విరుచుకపడ్డారు. దళితులు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదా.. సొంతింట్లో ఉండకూడదా అని సూటిగా ప్రశ్నించారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని, బాబుకు పేదల గురించి మాట్లాడే హక్కే లేదని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు.
 

మరిన్ని వార్తలు