‘పార్టీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి విజయవంతం కావాలి’

6 Jul, 2021 19:00 IST|Sakshi

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు ఎంపీ రేవంత్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎంపీ రేవంత్‌రెడ్డి మంగళవారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా మల్లు భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు అంతా పెద్ద ఎత్తున టీపీసీసీ అధ్యక్ష పదవి స్వీకార కార్యక్రమానికి కదలిరావాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా తుంగలో తొక్కి, వనరులను దోపిడీ చేస్తోందని మండిపడ్డారు.

ఏ లక్ష్యాల కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారో వాటికోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని అందరం కలసికట్టుగా అధికారంలోకి తీసుకు వచ్చి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ లక్ష్యాలను చేరుకోవాలనిపేర్కొన్నారు. కొత్తగా తెలంగాణ పీసీసీ బాధ్యలు అందుకుంటున్న రేవంత్‌రెడ్డి.. పార్టీ అధ్యక్షుడిగా విజయవంతం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. పార్టీలో కిందిస్థాయి కార్యకర్త నుంచి పైస్థాయి నాయకుడి వరకు అందరిని రేవంత్ రెడ్డి కలుపుకుని ముందుకు పోవాలని సూచించారు. 

మరిన్ని వార్తలు