‘‘చంద్రగిరిలో చంద్రబాబు శంకరగిరి మాన్యాలు పట్టారు’’

19 Sep, 2021 15:30 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ‘‘ఆంధ్రప్రదేశ్‌ పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ దూసుకుపోతుంది. ఇంత చక్కని ఫలితాలు అందించిన ప్రజలకు కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలన చేస్తున్నారు కాబట్టే ఇంత మంచి ఫలితాలు వస్తున్నాయి’’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘స్థానిక సంస్థలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మహాత్మా గాంధీ చెప్పినట్లు స్థానికంగా పరిపాలన జరగాలి. ఈ ఎన్నికలు సరైన సమయంలో జరగాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ గత ప్రభుత్వంలోనే గడువు ముగిసింది. రాజ్యాంగపరంగా ఎన్నికలు జరపాలి. చంద్రబాబు గెలవలేమని ఎన్నికలు పెట్టకుండా పారిపోయాడు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలు పెట్టాలని కృషి చేశారు. అప్పుడు ప్రారంభించిన ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది’’ అన్నారు.  

‘‘ఈ లోపు చంద్రబాబు, ఆయనతో కలిసి కొన్ని దుష్ట శక్తులు ఎన్నో కుట్రలు చేశారు. అర్ధాంతరంగా వాయిదా వేయడం నుంచి ఎన్నికలు జరిగినా ఫలితాలను ప్రకటించకుండా చేశారు. అన్ని అవరోధాలు దాటుకుని ఈ రోజు ఫలితాలు వస్తున్నాయి. దీంతో మేము బహిష్కరించాం అని మాట్లాడుతున్నారు. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో నువ్వు, నీ కొడుకు కాలికి బలపం కట్టుకుని తిరిగారు.. ఫలితాలు ఏమైనా మారాయా. కుప్పం కూడా కుప్పకూలి పోయింది... చంద్రగిరి శంకరగిరి మాన్యాలు పట్టింది. ఇక టీడీపీ మూసేయడానికి సిద్ధంగా ఉంది...తెలుసుకోలేకపోతే నీ ఖర్మ’’ అన్నారు అంబటి. 

‘‘ఈ ఫలితాలు జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలన చేస్తున్నాడు కాబట్టే వస్తున్నాయి. ఇలాంటి చక్కని ఫలితాలను ఇస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు. ఏ ఎన్నికలైనా ఒకే ఫలితాలను ఇస్తున్నారు కుట్రలు కుతంత్రాలు తప్ప ప్రజల మధ్యకు వెళ్లి గెలవాలని చంద్రబాబుకి లేదు. ఆయన అధికారంలోకి వచ్చిందే కుట్రల వల్ల మమ్మల్ని 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు అధికారం ఇచ్చారు. ఇప్పుడు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కావాలంటే టీడీపీ మొత్తం రాజీనామా చేయండి... మీ నియోజకవర్గాల్లో పోటీ చేసి తేల్చుకుందాం’’ అంటూ అంబటి సవాలు విసిరారు. 

చదవండి: పూర్తి ప్రజామోదంతో మెరుగైన పరిపాలన చేస్తాం: మంత్రి కురసాల

మరిన్ని వార్తలు