మునుగోడు ఉప ఎన్నిక; బీఎస్పీ అభ్యర్థిగా యువ నాయకుడు

8 Oct, 2022 16:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థిని బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రకటించారు. ఆందోజు శంకరాచారిని తమ పార్టీ తరపున పోటీకి నిలబెడుతన్నట్టు ఆయన వెల్లడించారు. శనివారం శంకరాచారికి పార్టీ తరపున బిఫాం అందించారు. ఉన్నత విలువలున్న యువనాయకుడు శంకరాచారిని గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. కలుద్దాం- నిలుద్దాం- గెలుద్దాం నినాదంతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. 

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్‌ నవంబర్‌ 3న జరగనుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ తరపున కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా ప్రజాగాయకుడు గద్దర్‌ను ఖరారు చేశామని ఆ పార్టీ అధినేత కేఏ పాల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక మునుగోడులో విజయం కోసం రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ముఖ్య నేతలను రంగంలోకి దించాయి. మునుగోడులో విజయం ఎవరిని వరిస్తుందో నవంబర్‌ 6న వెల్లడవుతుంది. (క్లిక్ చేయండి: పదోసారి పోటీ.. మునుగోడులో విజయం నాదే)

మరిన్ని వార్తలు