నడ్డా అనే అడ్డమైన వాడు ఆరేళ్ల కిందట హామీ ఇచ్చాడు.. ఏమైంది?: కేటీఆర్‌

20 Oct, 2022 20:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాస్వామ్య​ పద్దతుల్లో గెలవలేక రాజ్యంగ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ శిఖండి రాజకీయాలు చేస్తోందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఎన్నిక అని పేర్కొన్నారు. మునుగోడు ప్రజలు ఉప ఎన్నికలో బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ గురువారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో బూడిద బిక్షమయ్య గౌడ్‌కు కేటీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ ధనమదంతో మునుగోడులో గెలవాలని కుటిల ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీకి దమ్ము, ధైర్యం ఉంటే తెలంగాణకు ఏం తెచ్చారో ప్రజలకు చెప్పి మునుగోడులో ఓటు అడగాలని సవాల్‌ విసిరారు. నడ్డా అనే అడ్డమైన వాడు 300 పడకల ఆస్పత్రి కట్టిస్తామని ఆరేళ్ల కిందట హామీ ఇచ్చాడని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. మోదీ, ఇంకో బోడీ ఇక్కడికి వచ్చి పీకేదేమీ లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు మూతిమీద తన్నినట్టు సమాధానం చెబుతారన్నారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నీ మోదీ చేతిలో కీలుబొమ్మల్లా మారాయని మండిపడ్డారు. 

‘భారతీయ జనతా పార్టీ ఒక నీతి జాతి లేని పార్టీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించే అర్హత ఏమాత్రం లేదు. ఆయన ఒక నిస్సహాయ మంత్రి. రాజగోపాల్‌రెడ్డి చిన్న కంపెనీకి అంత పెద్ద కాంట్రాక్ట్‌ ఇచ్చింది ఎవరు.. దాని వెనకున్న పెద్దలెవరు. ఇందులో దాగిన ఆ గుజరాత్‌ రహస్యమేంటి. 3 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉండి, కోవర్ట్‌ రాజకీయం చేసి, బేరం కుదిరాకే రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారారు. బీజేపీ ఉన్మాద ప్రవర్తనను ధీటుగా ఎదుర్కోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. బీజేపీ విష సంస్కృతికి తెరతీసింది. బీజేపీ వ్యవస్థల్ని ఎలా దుర్వినియోగం చేస్తోందో స్పష్టంగా కనిపిస్తోందని’ అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.
చదవండి: బీజేపీపై భిక్షమయ్య ఘాటు విమర్శలు.. అందుకే రాజీనామా చేశారా?

మరిన్ని వార్తలు