టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చిన కమ్యూనిస్టుల మద్దతు.. కమలం ఆశలకు గండికొట్టిన కామ్రేడ్లు..

7 Nov, 2022 03:57 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి కమ్యూనిస్టుల పొత్తు కలిసొచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించేందుకు ఈ పొత్తు దోహదపడింది. నియోజవర్గంలో సీపీఐ, సీపీఎంలకు ఉన్న బలం టీఆర్‌ఎస్‌కు తోడవడంతో ఆ పార్టీకి గెలుపు దక్కింది.

కాంగ్రెస్‌ పార్టీ నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరడంతో వారి ద్వారా కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు కొంత మేర టీఆర్‌ఎస్‌ వైపు మళ్లడం కూడా టీఆర్‌ఎస్‌కు లాభం చేసింది. ఈ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి గెలుపొందడం ద్వారా దక్షిణ తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ భావించింది.

అయితే, బీజేపీని అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్‌ పకడ్బందీ వ్యూహం అమలు చేశారు. సీపీఐ, సీపీఎం నాయకులతో మాట్లాడి ఆ రెండు పార్టీల మద్దతు పొందారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తరఫున సీపీఎం, సీపీఐ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.

నియోజకవర్గంలో 15 వేల వరకు ఉన్న తమ ఓటు బ్యాంకును టీఆర్‌ఎస్‌కు మరల్చడంలో సక్సెస్‌ అయ్యారు. కమ్యూనిస్టులు కలిసి రావడంతో టీఆర్‌ఎస్‌కు మేలు చేకూరింది. తద్వారా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 10,309 ఓట్ల మెజారిటీతో గెలుపాందారు.
చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..

మరిన్ని వార్తలు