నవంబర్‌ 3న మునుగోడు దంగల్‌: ఆ మూడు పార్టీల గేమ్‌ ప్లాన్‌ ఇదే

3 Oct, 2022 13:22 IST|Sakshi

సాక్షి, నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు నెల రోజులు మాత్రమే ఉంది. నవంబర్ 3 పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో మూడు ప్రధాన పార్టీలు తల మునకలయ్యాయి. మునుగోడు ముఖచిత్రాన్ని పరిశీలిస్తే మునుగోడులో మొత్తం ఓటర్లు 2 లక్షల 27 వేల 101. సామాజిక‌ వర్గాల వారీగా అధికంగా ఉన్న ఓటర్లు గౌడ, ముదిరాజ్, యాదవ, పద్మ శాలి, ఎస్సీలు, రెడ్డి. మొత్తం మండలాలు ఏడు. మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ, చౌటుప్పల్, నారాయణపురం, గట్టుప్పల‌. నియోజకవర్గంలో మొత్తం రెండు మున్సిపాలిటీలు. చండూరు, చౌటుప్పల్.
చదవండి: మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులుగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పాల్వాయి స్రవంతిలను ఆ పార్టీలు ప్రకటించాయి. టీఆర్‌ఎస్‌ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. టీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లపై 22552 మెజారిటీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డికి వచ్చిన ఓట్లు 97239, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి వచ్చిన ఓట్లు 74687. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డికి‌ వచ్చిన ఓట్లు 12725 ఓట్లు. మొత్తం మునుగోడులో ఉన్న గ్రామాల సంఖ్య 159. మునుగోడు లో ఉన్న బూతుల సంఖ్య 294.

రెండు గ్రామాలకు ఒక ఇంఛార్జ్‌గా ఎమ్మెల్యేను నియమించే వ్యూహంలో టీఆర్‌ఎస్‌ ఉంది. ప్రతీ వంద మంది ఓటర్లకు ఒక ఇంచార్జ్‌ని నియమించేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. లక్ష ఓట్లు కొల్లగొట్టేవిధంగా బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. రెండు బూత్‌లకి ఒకరి చొప్పున‌ 150 మంది ఇంచార్జులను కాంగ్రెస్‌ నియమించింది. 76 వేల ఓట్లను‌ టార్గెట్‌గా కాంగ్రెస్‌ పెట్టుకుంది.

మరిన్ని వార్తలు