కాంగ్రెస్‌లో సీనియర్లు, పెద్దలు అంతా అక్కడే.. భీకర పోరు తప్పదా?

27 Aug, 2022 09:25 IST|Sakshi

జిల్లాల విభజన తర్వాత నల్గొండలోకి ఆరు సెగ్మెంట్లు చేరాయి. కాంగ్రెస్‌లో సీనియర్లు, పెద్దలు అంతా ఈ జిల్లాలోనే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ గెలుచుకున్న మూడింట్లో రెండు ఇందులోనే ఉన్నాయి. నకిరేకల్‌ ఎమ్మెల్యే కారెక్కగా, మునుగోడులో రాజగోపాలరెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పోరు భీకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌లో పెద్ద తలకాయలుగా భావించే కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాకు చెందినవారే. జిల్లా కేంద్ర నియోజ‌కవ‌ర్గం నల్లగొండ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌. మాజీ మంత్రి కొమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి నాలుగుసార్లు గెలిచారు. కానీ గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న టీఆర్ఎస్ అభ్యర్థి కంచ‌ర్ల భూపాల్‌రెడ్డి చేతిలో ఓట‌మి పాల‌య్యారు. న‌ల్లగొండ నుంచి మ‌రోసారి అసెంబ్లీకి పోటీ చేస్తాన‌ని కొమ‌టిరెడ్డి ఇప్పటికే ప్రక‌టించారు. మొన్నటి ఎన్నిక‌ల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్‌రెడ్డి మ‌రోసారి గెలిచేందుకు కంచ‌ర్ల ప్రణాళిక‌లు ర‌చిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా గెలిస్తే త‌న రాజ‌కీయ భ‌విష్యత్తుకు తిరుగుండ‌ద‌ని కంచర్ల భావిస్తున్నారు. గులాబీ పార్టీలో చాలా మంది నల్గొండ సీటు ఆశిస్తున్నా కంచర్లకు మాత్రమే మంత్రి జగదీష్‌రెడ్డి అండ దండలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు.  

ఇక బీజేపీ విష‌యానికి వ‌స్తే గత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నాలుగో స్థానంలో నిలిచిన పార్టీ ఈసారి గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని త‌హ‌తహ‌లాడుతోంది. ఆ పార్టీ నుంచి క‌న్మంతరెడ్డి శ్రీ‌దేవిరెడ్డితో పాటు మాద‌గోని శ్రీనివాస్ గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ ఇద్దరిని కాద‌ని బల‌మైన ఆర్థిక పునాదులు ఉన్న ఓ వ‌ల‌స నేత‌ను కూడా పార్టీలో చేర్చుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆ వ‌లస నేత‌తో రాష్ట్ర నేత‌లు చ‌ర్చలు జ‌రిపార‌ని తెలుస్తోంది. 

మునుగోడు అసెంబ్లీ స్థానం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్‌సీట్‌గా మారింది. కాంగ్రెస్‌లో ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఉప ఎన్నికకు తెర తీసారు. ఇప్పటికే కాషాయ కండువా కప్పుకుని కయ్యానికి సిద్ధమయ్యారు రాజగోపాల్‌రెడ్డి. ఇప్పటికి రెండు ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీకి చుక్కలు చూపించింది కాషాయ సేన. ఇప్పుడు మునుగోడులో కూడా కాషాయ జెండా ఎగరేస్తామంటున్నారు ఆ పార్టీ నాయకులు. సిట్టింగ్‌సీటును కాపాడుకోవడానికి కాంగ్రెస్‌, హుజురాబాద్‌అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీఆర్ఎస్‌అప్పుడే వ్యూహాలు పన్నుతున్నాయి. తన సీటు తాను గెలుచుకుని బీజేపీకి బహుమతిగా ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ల నుంచి ఎవరి బరిలోకి దిగుతారన్నదే ప్రశ్నార్థకంగా మారింది.

టీఆర్ఎస్‌లో మునుగోడు టిక్కెట్ ఆశిస్తున్న వారి సంఖ్య అర‌డ‌జ‌ను దాటింది. ఇప్పుడు ఇదే ఆ పార్టీని క‌ల‌వ‌ర‌పెడుతోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాక‌ర్ రెడ్డితో పాటు శాస‌న‌మండలి చైర్మన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, నార‌బోయిన ర‌వి, కంచ‌ర్ల కృష్ణారెడ్డి, క‌ర్నె ప్రభాక‌ర్, క‌ర్నాటి విద్యాసాగ‌ర్ కొత్తగా తెర‌పైకి వ‌చ్చారు. వీరిలో కూసుకుంట్ల, గుత్తా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇద్దరిలో ఒక‌రికి టికెట్ వ‌చ్చే అవ‌కాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి మాత్రం కూసుకుంట్ల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఆయనకు టిక్కెట్‌ఇస్తే తాము స‌హ‌క‌రించ‌బోమ‌ని 12 మంది నేత‌లు మంత్రి కేటీఆర్‌కి రాసిన లేఖ ఇప్పుడు గులాబీ పార్టీ నాయకత్వాన్ని క‌ల‌వ‌ర పెడుతోంది. 

జిల్లాలో మిగిలిన ఏకైక స్థానంలో కాంగ్రెస్‌దాదాపు ఖాళీ అయింది. అందుకే ఇక్కడ ప‌రువు నిల‌బెట్టుకోవ‌డానికి కాంగ్రెస్ శ‌త‌విధాలా ప్రయ‌త్నిస్తోంది. కాని రాష్ట్ర ముఖ్యనేతలు అనుసరిస్తున్న తీరుతో కాంగ్రెస్‌పరువు మిగిలేలా కనిపించడంలేదు. అనుచ‌ర వ‌ర్గం ఉన్న పాల్వాయి స్రవంతిని కాదని, చ‌ల్లమ‌ల్ల కృష్ణారెడ్డి అనే వ్యాపారిని రేవంత్‌రెడ్డి తెర‌పైకి తీసుకొచ్చారు. తాజాగా చెరుకు సుధాకర్‌పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పుడు అదే కాంగ్రెస్‌లో గంద‌ర‌గోళానికి తెర‌లేపింది. టికెట్ త‌న‌కే అన్న ధీమాతో స్రవంతి వారం క్రితం జ‌రిగిన స‌భ‌కు కూడా భారీగా జ‌న‌స‌మీక‌ర‌ణ చేశారు. టిక్కెట్‌రాకపోతే పాల్వాయి స్రవంతి ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేద్దామ‌నే ఆలోచ‌న‌లో ఉన్నట్లు తెలుస్తోంది. 

న‌కిరేక‌ల్ టీఆర్ఎస్‌లో వ‌ర్గపోరు తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన చిరుమ‌ర్తి టీఆర్ఎస్‌లో చేర‌డంతో, ఓట‌మి బాధ‌తో ఉన్న వీరేశం వ‌ర్గానికి ఈ వ్యవ‌హారం మింగుడు ప‌డ‌టంలేదు. దీంతో రెండువ‌ర్గాల వైరం మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే స్థాయికి చేరుకుంది. ఈసారి తమకే టిక్కెట్‌వస్తుందని రెండు వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇద్దరిలో ఒక్కరికే టిక్కెట్‌వస్తుంది గనుక..భంగపడ్డ నేత కచ్చితంగా పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 


చిరుమర్తి లింగయ్య కారు పార్టీలో చేరడంతో కాంగ్రెస్‌క్యాడర్‌ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడటంతో... అన్న వెంకటరెడ్డి పరిస్తితి కూడా డైలమాలో పడినట్లయింది. ఎన్నికల నాటికి కాంగ్రెస్‌లో ఎవరుంటారో, ఎవరు ఫిరాయిస్తారో అన్న విషయం గందరగోళంగా మారింది. ఇక బీజేపీకి కొంతవరకు క్యాడ‌ర్ ఉన్నా స‌రైన లీడ‌ర్‌లేకపోవ‌డంతో అయోమయంగా తయారైంది. దీంతో మాజీ ఎంపీ వివేక్ వెంక‌ట‌స్వామిని ఇక్కడ నుంచి బరిలో దింపాలని కమలం పార్టీ ప్లాన్‌చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మిర్యాలగూడలో సీపీఎం, కాంగ్రెస్ దెబ్బతిని ప్రస్తుతం గులాబీ పార్టీ జెండా ఎగురుతోంది. అయితే కాంగ్రెస్‌కేడర్‌మాత్రం  బలంగానే ఉంది. సిటింగ్‌ఎమ్మెల్యే ఉన్న అధికార పార్టీలో బ‌య‌ట‌ప‌డిన వ‌ర్గపోరు ప్రకంప‌న‌లు సృష్టిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు, మున్సిప‌ల్ చైర్మన్ తిరున‌గ‌రు భార్గవ్ మ‌ధ్య వ‌ర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. త‌న కుమారుడిని రంగంలోకి దించాల‌నుకుంటున్న భాస్కరరావుకు భార్గవ్ తీరు ఆందోళన కలిగిస్తోందట. టిక్కెట్‌రేస్‌లో ఇద్దరూ తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. ఇక కాంగ్రెస్‌నేతలు పార్టీని గాలికొదిలేసి గ్రూప్‌కలహాల్లో మునిగి తేలుతున్నారు. సీనియర్‌నేత జానారెడ్డి తన కుమారుడిని రంగంలోకి దించాలని భావస్తున్నారు. బత్తుల లక్ష్మారెడ్డి జానారెడ్డి తనయుడిని వ్యతిరేకిస్తూ...తనకే టిక్కెట్‌ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి ఇక్కడ సరైన నాయకుడే లేరు.

నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటలా ఉండేది. కానీ గత ఎన్నిక‌ల్లో జానారెడ్డి ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వాత జరిగిన ఉప ఎన్నికలో సైతం భంగపాటు తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో ఎవ‌రు పోటీ చేస్తార‌నేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. మ‌రోసారి జానారెడ్డి పోటీ చేస్తారా లేక ఆయ‌న వారసుడు జైవీర్‌ను రంగంలోకి దించుతారా అనేది స‌స్పెన్స్‌గా ఉంది. మ‌రోవైపు టీఆర్ఎస్‌లో గ్రూపుల గోల ఎక్కువైంది. ఎమ్మెల్యే నోముల భ‌గ‌త్‌కు ఎమ్మెల్సీ కోటిరెడ్డి మ‌ధ్య స‌ఖ్యత లేదు. ఎమ్మెల్సీగా అవ‌కాశం రాని తేరా చిన్నప‌రెడ్డి కూడా కాచుకుని ఉన్నారు. బీజేపీ వరుసగా పోటీ చేస్తున్నప్పటికీ కనీసం పోటీ ఇవ్వలేకపోతోంది.

జిల్లాలో ఉన్న ఏకైక ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం దేవ‌రకొండ. ఒక‌ప్పుడు కాంగ్రెస్, సీపీఐల‌కు కంచుకోట‌గా ఉండేది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌గెలిచినా..అధికార పార్టీలోను, కాంగ్రెస్‌లోను వర్గపోరు తీవ్రస్థాయిలో సాగుతోంది. బీజేపీ పరిస్థితి మాత్రం కేడర్‌లేదు నాయకులు లేరన్నట్లుగా తయారైంది. తెలంగాణ ఏర్పడిన త‌ర్వాత ఒక‌సారి కాంగ్రెస్ నుంచి మ‌రోసారి టీఆర్ఎస్ నుంచి గెలిచిన ర‌వీంద్రకుమార్ హ్యాట్రిక్‌సాధించాల‌నుకుంటున్నారు. కాని దేవేందర్‌నాయక్‌టీఆర్ఎస్ టిక్కెట్‌కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌లో పోటీ చేయడానికి చాంతాడంత లిస్ట్‌తయారైంది. పార్టీ టిక్కెట్‌రాకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగడానికి ఇద్దరు ముగ్గురు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఇక బీజేపీలో కూడా రెండు వర్గాలు టిక్కెట్‌కోసం పరస్పరం పోటీ పడుతున్నాయి.

మరిన్ని వార్తలు