-

మంచి బట్టలు తొడిగినా ఓర్వలేడు!.. ఆయనకు టికెట్‌ ఇస్తే..

13 Aug, 2022 09:14 IST|Sakshi
చౌటుప్పల్‌ మండలం మల్కాపురంలోని ఫంక్షన్‌ హాల్‌లో సమావేశమైన మునుగోడు టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలు

ప్రభాకర్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతల ఆగ్రహం

సాక్షి, నల్గొండ: మునుగోడు టీఆర్‌ఎస్‌లో అసమ్మతి చల్లారడం లేదు. మంత్రి జగదీశ్‌రెడ్డి బుజ్జగించినా అసమ్మతి సద్దుమణగడం లేదు. మంత్రికి చెప్పుకున్నా ఫలితం లేదని అసంతృప్తితో ఉన్న నేతలు మరోసారి దైవకార్యం పేరిట చౌటుప్పల్‌ మండలం ఆంథోల్‌ మైసమ్మ దేవాలయం వద్ద ఓ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. చౌటుప్పల్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, సింగిల్‌విండో చైర్మన్లు కలుపుకొని 200 మందికి పైగా నాయకులు సమావేశమయ్యారు.

మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తమను ఎలా ఇబ్బంది పెట్టారు.. ఆర్థికంగా ఎలా దెబ్బకొట్టారు.. అనే విషయాలను ఒక్కొక్కరుగా మాట్లాడారు. మంచి బట్టలు తొడిగినా ఓర్వలేదని, గ్రామాల్లో గ్రూపులు కట్టి విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అందరూ కలసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వవద్దని, ఇస్తే పనిచేయొద్దని, ఆయనకు తప్ప ఎవరికిచ్చినా సరే అని తీర్మానం చేసి సంతకాలు చేశారు. ఈ తీర్మాన పత్రాన్ని పార్టీ అధిష్టానానికి అందజేయనున్నట్టు చౌటుప్పల్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి తెలిపారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు.  

చదవండి: (మునుగోడులో పెరిగిపోతున్న పొలిటికల్‌ హీట్‌)

మరిన్ని వార్తలు