ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నీతులా?

4 Oct, 2020 04:55 IST|Sakshi

సబ్బంపై మంత్రి ముత్తంశెట్టి, ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ ధ్వజం

మహారాణిపేట (విశాఖ దక్షిణ): టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నీతులు చెబుతున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ ధ్వజమెత్తారు. శనివారం విశాఖపట్నం ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌లో వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. 

► వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక జీవీఎంసీ పరిధిలో 450 అక్రమ కట్టడాలను కూల్చివేసింది.
► పార్క్‌ స్థలాన్ని ఆక్రమించి సబ్బం హరి కట్టిన గోడను తొలగిస్తే విశాఖకు ఎంతో అన్యాయం, ఘోరం జరిగినట్టుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. 
► ఆక్రమణలు కూల్చడానికి వెళ్లిన జీవీఎంసీ సిబ్బంది, పోలీసులు, సీఎం, ఎంపీ విజయసాయిరెడ్డిని సబ్బం నోటికి వచ్చినట్టు తిట్టడం ఎంతవరకు సమంజసం? 
► మాజీ మేయర్‌గా పనిచేసిన సబ్బంకు ప్రభుత్వం స్థలం ఆక్రమించకూడదని తెలియదా? ఆయన చేసిన తప్పిదాలను సమర్థిస్తూ చంద్రబాబు, లోకేష్‌ మాట్లాడడం దారుణం. 
► టీవీ చర్చల్లో శ్రీరంగ నీతులు చెప్పే సబ్బం ఇప్పటికైనా తన తప్పు ఒప్పుకోవాలి. భవిష్యత్తులో సీఎంను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. సబ్బం ఒళ్లు, నోరు దగ్గర పెట్టుకోవాలి. 
► ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ, పార్టీ నేతలు కె.కె.రాజు, కోలా గురువులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు