‘తాకట్టు పెట్టిన పుస్తెల తాడు ఇంటికి తెస్తానన్నావ్‌.. కానీ నువ్వు చేసిందేమిటి?’

11 Jun, 2022 12:58 IST|Sakshi

ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి

సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులను అణిచివేశారని ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కోనసీమలో ప్రతి రైతుకు ధాన్యం డబ్బులు చెల్లించామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు.
చదవండి: కింజరాపు వారి మైనింగ్‌ మాయ.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్‌ బాగోతం 

ఇన్‌పుట్‌ సబ్సిడీని సకాలంలో చెల్లిస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక ఆత్మహత్యలు తగ్గిపోయాయన్నారు. అధికారం కోల్పోయాకే చంద్రబాబుకు రైతులు గుర్తొస్తారని నాగిరెడ్డి దుయ్యబట్టారు.

‘‘రాష్ట్రంలో వ్యవసాయ రంగం నాశనం అయిందట.. చంద్రబాబు ఉన్నపుడు బాగుందట. కోనసీమలో క్రాప్ హాలిడే అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. తాకట్టు పెట్టిన పుస్తెల తాడు ఇంటికి తెస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. కానీ ఆ రోజు ఇచ్చిన హామీలను ఒక్కటైనా అమలు చేశారా?. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఆ రోజు చంద్రబాబును ప్రశ్నించారా?. చంద్రబాబు పెట్టిన బకాయిలు కూడా చెల్లించింది సీఎం వైఎస్‌ జగన్‌.

76 వేల కోట్ల రూపాయలు రైతులకు ఇప్పటికే అందించాం. ఎఫ్‌సీఐ నుంచి రూ.300 కోట్లకు పైగా రావాలి. పవన్ కల్యాణ్‌ ఎవరిని ప్రశ్నించాలి.? ఆ డబ్బు ఇప్పించాలని బీజేపీని పవన్ ఎందుకు ప్రశ్నించరు..?. కోనసీమలో ధాన్యం డబ్బు ప్రతి రైతుకు అందాయి. కోనసీమకు ఈ పని చేశానని చంద్రబాబు ధైర్యంగా చెప్పాలి. చంద్రబాబు హయాంలో కరువు మండలాలుగా ప్రకటిస్తే.. మేము వచ్చాక కరువు మండలాలే లేవు. రైతులకు పంటల బీమా, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ విషయంలో టీడీపీ చేసిందేమిటి...? చంద్రబాబు 11 శాతం మేర వ్యవసాయ బడ్జెట్ పెడితే.. మేము మొన్నటి బడ్జెట్లో 16 శాతం పెట్టాం. నేను వెళ్లడం వల్లే రైతులకు ధాన్యం డబ్బులు వచ్చాయ్ అని పవన్ అంటున్నాడు. ఆయన వెళ్లడం వల్లనే రైతు భరోసా, అమ్మఒడి వంటి పథకాలు వచ్చాయా..?. కోనసీమ గొడవలు జరిగాక ఇప్పుడు మళ్లీ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని’’ నాగిరెడ్డి నిప్పులు చెరిగారు.

మరిన్ని వార్తలు