ఒక్క పింఛన్‌ తీసేసినా.. ప్రభుత్వాన్నే ఊడదీస్తా..!

9 Apr, 2021 15:28 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు జానారెడ్డి హెచ్చరిక

శాసనమండలి చైర్మన్‌ గుత్తాకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు

అధికార పార్టీకి ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి

పెద్దవూర: ‘‘టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకుంటే పింఛన్‌ తీసేస్తామని ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తున్నారంట.. ఒక్కరి పింఛన్‌ తీసేసినా ఈ ప్రభుత్వాన్నే ఊడదీస్తా’’ అని సాగర్‌ ఉప ఎన్నిక కాంగ్రెస్‌ అభ్యర్థి, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి హెచ్చరించారు. గురువారం మండలంలోని బట్టుగూడెం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శాసనమండలి చైర్మ న్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి రాజకీయాలు మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా ఉన్న భూమిలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టలేని చేతగాని ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అని అన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ ప్రజలందరినీఅరాచకవాదులుగా తయారుచేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి  ఉప ఎన్నికలో తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దళితులకు మూడెకరాల భూమి, రైతు రుణమాఫీ, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు వంటి హామీల అమలు ఏమయ్యాయని ప్రశ్నించా రు. రాష్ట్రంలో ఒక కొత్త చరిత్రను సృష్టించటానికి, ఆదర్శవంతమైన రాజకీయం, ఇచ్చిన హామీలు నెరవేర్చటానికి జానారెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క,  జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, స్థానిక ఎంపీటీసీ కత్తి మహాలక్ష్మీముత్యాల్‌రెడ్డి, కూన్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, ముస్కు నారాయణ, సువర్ణ, కూతాటి అర్జున్, నక్కల రామాంజిరెడ్డి, కత్తి కనకాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిక
తిరుమలగిరి : మండలంలోని గోడుమడకలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పలువురు గురువారం జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ బూడిద కొండలు, గుడాల వెంకటయ్య, బాలు, సోమయ్య, రంగయ్య, వెంకటయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.   

కాంగ్రెస్‌ పార్టీ గెలవడం చారిత్రక అవసరం
పెద్దవూర: సాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జానారెడ్డి గెలవడం రాష్ట్రానికి చారిత్రక అవసరమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గురువారం మండలంలోని బసిరెడ్డిపల్లి, వెల్మగూడెం, బట్టుగూడెం, కొత్తగూడెం, కటికర్లగూడెం గ్రామాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు పబ్బు యాదగిరిగౌడ్, ఎంపీటీసీ కత్తి మహాలక్ష్మీముత్యాల్‌రెడ్డి, కూన్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, చంద్రారెడ్డి, బక్కయ్య, శంకర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు