టీడీపీ మద్యపాన ఉద్యమం

9 Sep, 2021 05:22 IST|Sakshi

డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ మంత్రి నారాయణస్వామి విమర్శ

ప్రభుత్వం చిత్తశుద్ధితో దశల వారీ మద్య నిషేధం చేస్తోంది

రాష్ట్రంలో మద్యం షాపుల సంఖ్య తగ్గించాం.. విక్రయాలు తగ్గాయి

సాక్షి, అమరావతి: విద్యార్థులు, రైతులు, నిరుపేదలు, ఇతర వర్గాల సమస్యలపై చాలా ఉద్యమాలు నడిచినా టీడీపీ మాత్రం మద్యపాన ఉద్యమాన్ని నడుపుతోందని ఉప ముఖ్యమంత్రి,  ఎక్సైజ్‌శాఖ మంత్రి కె.నారాయణస్వామి వ్యాఖ్యానించారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ఆయ న విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అమలు చేసున్న సంక్షేమ పథకాలపై విమర్శించడానికి ఆస్కారం లేకపోవడంతో మద్యం పై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మద్యం షాపులకు లైసెన్స్‌లు ఇచ్చి నిర్వహించాలని సలహా ఇచ్చింది చంద్రబాబేనని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ మద్యనిషేధం అమలుచేస్తే చంద్రబాబు సీఎం కాగానే ఎత్తివేశారని చెప్పారు. మద్యనిషేధం అమలు చేసి పేదలకు రూ.2కే కిలో బియ్యం కూడా ఇస్తే అసెంబ్లీని మూసుకోవాల్సి వస్తుందని చంద్ర బాబు వ్యాఖ్యానించడం నిజంకాదా? అని ప్రశ్నిం చారు. మద్య నియంత్రణతో పేదలు బాగుపడటం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. లిక్కర్‌ మాఫియా వెనుక ఆయన హస్తం ఉందన్నారు.  

63 శాతం తగ్గిన వినియోగం
ప్రజల విజ్ఞప్తి మేరకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి కట్టుబడుతూ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బెల్టు షాపుల తొలగింపు ఫైల్‌పై సీఎం జగన్‌ సంతకం చేశారని మంత్రి నారాయణస్వామి చెప్పారు. దశలవారీ మద్య నియంత్రణ వల్ల 63 శాతం వినియోగం తగ్గిందన్నారు. టీడీపీ హయాంలో 4,380 మద్యం దుకాణాలుంటే వాటిని 2,934కి కుదించామన్నారు. 43 వేల బెల్టు షాపులను పూర్తిగా రద్దుచేయడంతోపాటు 4,380 పర్మిట్‌ రూమ్‌లను కూడా రద్దుచేశామన్నారు. విక్రయాల వేళలను ఉదయం 11 రాత్రి 8 గంటలకు కుదించా మన్నారు. ఈ వ్యసనం నుంచి దూరం చేసేందుకు షాక్‌ కొట్టేలా ధరలను పెంచామన్నారు. ప్రస్తుతం ఉన్న మద్యం ఉత్పత్తి డిస్టిలరీలన్నీ టీడీపీ హయాంలో ఏర్పాటైనవేనని స్పష్టం చేశారు.

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) ద్వారా మద్యం అక్రమాలను అరికడుతున్నామన్నారు. గత ఏడాది మే నుంచి ఇప్పటివరకు మద్యం అక్రమాల పై 1,14,689 కేసులను నమోదు చేసి 2,00,786 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 51,103 వాహనాలను స్వాధీనం చేసుకుని 7,71,288 లీటర్ల నాటుసారా, 2,19,55,812 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 7,12,557 లీటర్ల ఎన్‌డీపీఎల్, 95,238 లీటర్ల డ్యూటీ పెయిడ్‌ లిక్కర్, 2,49,162 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

అభివృద్ధి పథంలో గంగాధర నెల్లూరు
గతంలో ఎన్నడూ లేనివిధంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రోడ్లు వేయకముందు, ఆ తరువాత జరిగిన అభివృద్ధిని ఫోటోలతో వివరించారు. నాణ్యతలో రాజీ పడకుండా ప్రభుత్వం పనులు చేపడుతోందన్నారు. 

మరిన్ని వార్తలు