ప్రధాని మోదీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో ఎక్కడా చైనా పేరును ఎత్తకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. భారత ఆర్మీ శక్తిసామర్థ్యాలేంటో అందరికీ తెలుసని, కానీ ప్రధాని మోదీకి మాత్రం తెలీదని ఎద్దేవా చేశారు. ఆయన పిరికితనమే చైనా మన భూమిని ఆక్రమించుకునేందుకు కారణమైందని రాహుల్ విమర్శించారు. కాగా భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న చైనా బలగాలను వెనక్కు పంపేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ శనివారం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. (ఎల్ఓసీ నుంచి ఎల్ఏసీ వరకు గట్టిగా బుద్ధి చెప్పాం)
ఆర్మీ, పారా మిలటరీ, పోలీసు బలగాల సేవల పట్ల గర్విస్తున్నామని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా.. 130 కోట్ల మంది భారతీయులు, కాంగ్రెస్ కార్యకర్తలు వారిని తలుచుకుని గర్విస్తున్నామన్నారు. మనపై దాడికి దిగినప్పుడల్లా సాయుధ బలగాలు వారికి గట్టి సమాధానమిచ్చాయని పేర్కొన్నారు. కానీ మన పాలకులు మాత్రం చైనా పేరును ఎత్తడానికే జంకుతున్నారని ఎద్దేవా చేశారు. (కరోనా గ్రాఫ్ భయపెడుతోంది: రాహుల్)