బీజేపీ, ఎన్సీపీలు కలుసుకోవు: నవాబ్‌ మల్లిక్‌

18 Jul, 2021 00:06 IST|Sakshi

ఎన్సీపీ సీనియర్‌ నేత నవాబ్‌ మల్లిక్‌

ముంబై: ఎన్సీపీ, బీజేపీలు ఎప్పుడూ కలుసుకోలేవని, ఇరు పార్టీలు నది చివరల వంటివని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మంత్రి నవాబ్‌ మల్లిక్‌ అభిప్రాయపడ్డారు. శుక్రవారం నాడు ఢిల్లీలో ప్రధాని మోదీని, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ కలుసుకోవంతో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చలకు తెరదీశాయి. బీజేపీతో ఎన్సీపీ దోస్తీ కట్టబోతోందని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో శనివారం నవాబ్‌ మల్లిక్‌ స్పందించారు.  ‘ఎన్సీపీ ఎప్పుడూ బీజేపీతో చేతులు కలపదు. ఎందుకంటే రెండు పార్టీలు సైద్ధాంతికంగా భిన్నమైనవి, బీజేపీ, ఎన్సీపీలు ఒక నదికి రెండు చివరలు, అవి నదిలో నీరు ఉన్నంత వరకు కలిసి రావు‘ అని ఎన్‌సిపి ప్రతినిధి విలేకరులతో అన్నారు. ఎంవీఏ ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.

కొంతమంది ఆఘాడీ ప్రభుత్వాన్ని పడిపోతుందని తేదీలతో సహా చెబుతున్నారని, కానీ, వారి అంచనా ఎప్పటికీ నిజం కాబోదని నవాబ్‌ చురకలంటించారు. జాతీయన నిర్వచనంలో బీజేపీ, ఎన్సీపీలు భిన్నంగా ఉంటాయని ఆయన అన్నారు. ఆ పార్టీని ఆయన వాషింగ్‌ మెషీన్‌తో పోల్చారు. అక్కడ డాకోయిట్‌ కూడా సాధువుగా మారవచ్చు అన్నారు, ఇతర పార్టీల నాయకులను బలవంతంగా చేర్చుకోవడానికి బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుతోందని మలిక్‌ ఆరోపించారు. ఎన్సీపీ నాయకులు ఈడీ నోటీసులకు భయపడరని, ఎందుకంటే వారు తప్పు చేయరని వారికీ తెలుసని అన్నారు.

కాగా, మోదీ, పవార్‌ సమావేశంపై స్పందిస్తూ..  బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టానికి సవరణలపై చర్చించడానికి కలిశారని స్పష్టంచేశారు. అంతేకాకుండా సమావేశంపై సీఎం ఉద్ధవ్‌కు కూడా తెలియజేశారని తెలిపారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హెచ్‌కేపాటిల్‌కు కూడా దీనిపై ముందుగానే సమాచారం ఉందని అన్నారు. ‘బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి సవరణలు సహకార రంగ బ్యాంకులను దెబ్బతీస్తాయి, ఎందుకంటే ఆర్బీఐకి ఎక్కువ అధికారాలు ఇచ్చారు. సహకార బ్యాంకులు అధికార పరిమితులను ఎదుర్కొన్నాయి. సహకారం ఒక రాష్ట్ర విషయం ... పవార్‌ ఈ అంశంపై వాటాదారులందరితో చర్చిస్తున్నారు’’ అని నవాబ్‌ చెప్పారు.    

మరిన్ని వార్తలు