అమిత్‌ షాతో భేటీ అవ్వనున్న శరద్‌ పవార్‌

3 Aug, 2021 15:45 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

రెండు వారాల కిందట ప్రధాని మోదీతో భేటీ అయిన పవార్‌

న్యూఢిల్లీ: మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన‌-ఎన్సీపీ-కాంగ్రెస్‌ల‌తో కూడిన పాల‌క మ‌హా వికాస్ అఘ‌డి (ఎంవీఏ) స‌ర్కార్‌లో చీలకలు వచ్చాయా.. 2019లో ఎన్‌డీఏని ఓడించి అధికారం చేజిక్కించుకున్న ఎంవీఏలో స్పర్థలు తలెత్తాయా.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైన వ్యక్తి శరద్‌ పవార్‌.. ఎన్‌డీఏకి చేరువవుతున్నారా అనే అనుమానాలకు తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇప్పటికే రెండు వారాల క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) అధ్యక్షడు శరద్‌ పవార్‌ తాజాగా మంగళవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అవ్వనున్నారు.

పవార్‌ ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరిని కూడా కలిశారని సమాచారం. పవార్‌ వరుసపెట్టి ఎన్‌డీఏ ముఖ్యనేతలతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకోవడమే కాక పలు అనుమానాలకు తావిస్తోంది. కొన్ని నివేదికలు శరద్‌ పవార్‌ తదుపరి రాష్ట్రపతి రేసులో ఉన్నట్లు వెల్లడించాయి. కానీ పవార్‌ వీటిని ఖండించారు. 2024లో ప్రధాని పీఠం అధిరోహించాలనే ధ్యేయంతోనే పవార్‌, విపక్షాలతో భేటీ అవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఈ ఏడాది మార్చిలో శరద్‌ పవార్‌, ప్రఫుల్‌ పటేల్‌తో కలిసి అహ్మదాబాద్‌లో అమిత్‌ షాను కలిశారు. వీరి భేటీ రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం గురించి అమిత్‌ షాను ప్రశ్నించగా.. ప్రతిదాని గురించి బహిరంగపర్చవలసని అవసరం లేదన్నారు. దీని గురించి ఎన్‌సీపీ నేతలను ప్రశ్నించగా అమిత్‌ షా-పవార్‌ల భేటీని ఖండించారు. గత కొద్ది రోజులుగా పవార్‌, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో సహా పలువురు విక్షన నేతలతో వరుసగా సమావేశమయ్యారు. 

మరిన్ని వార్తలు