CWC Meeting: సోనియా గాంధీ ఫైర్‌.. సమావేశంలో కీలక నిర్ణయాలు

16 Oct, 2021 18:07 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పాత వైభవం కోసం ప్రణాళికలు మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో 23 మంది అసమ్మతి నేతలపై సీరియస్‌ అయ్యారు. సమావేశంలో సోనియా గాంధీ.. 'కాంగ్రెస్‌ పార్టీకి నేనే పూర్తి స్థాయి అధ్యక్షురాలిని. పార్టీ అంతర్గత విషయాలు మీడియా ద్వారా కాదు నేరుగా నాతో మాట్లాడండి. అన్ని అంశాలపై స్పష్టత తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ఎలాంటి అంశాలైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసింది.

అనంతరం సమావేశంలో రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు  డిమాండ్ చేయగా, అందుకు రాహుల్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు ​సమాచారం. తాజాగా దేశంలోని రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, రైతులపై జరుగుతున్న దాడులపై ఆమోదం తెలిపింది.

త్వరలో కాంగ్రెస్ పార్టీలో నాయకుల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు భారీగా శిక్షణా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, కాంగ్రెస్‌ కార్యకర్తల నుంచి పార్టీ ఆశిస్తున్న అంచనాలు, ఎన్నికల నిర్వహణ, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన విధానం పై ఈ శిక్షణ ఉండనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ పై వివరణాత్మకంగా చర్చించినట్లు తెలుస్తోంది. ధరల పెరుగుదల పై నవంబర్ 14 నుంచి 29 వరకు దేశవ్యాప్త ఆందోళన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 సీడబ్ల్యూసీలో సమావేశంలోని ముఖ్యాంశాలు:

►2021 నవంబర్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా సాగనున్న కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం 

► 2022 ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య ఖరారు కానున్న డీసీసీ ఎన్నికలకు పోటీ పడే అభ్యర్థుల జాబితా

► ఏప్రిల్ 16 నుంచి మే 31 వరకు ప్రాధమిక కమిటీలు, బూత్ కమిటీలు ,బ్లాక్ కమిటీల అధ్యక్షుల ఎంపిక 

►జులై 21 నుంచి 20 ఆగస్ట్ వరకు పీసీసీ, ఉపాధ్యక్షులు, కోశాధికారి, పిసిసి కార్యదర్శి వర్గం, ఏఐసిసి సభ్యులు ఎన్నిక

►2022 ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్  20 వరకు సాగనున్న ఏఐసిసి అధ్యక్ష ఎన్నిక

►సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో  ప్లీనరీ సమావేశం సందర్భంగా సిడబ్ల్యుసి సభ్యులు, ఏఐసిసి కమిటీల అధ్యక్షుల ఎంపిక

చదవండి: కాంగ్రెస్‌ పార్టీకి నేనే పూర్తి స్థాయి అధ్యక్షురాలిని: సోనియా గాంధీ

మరిన్ని వార్తలు