‘కోవిడ్ మరణాలు , కేసులను ప్రభుత్వం తగ్గించి చూపిస్తోంది’

11 May, 2021 14:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సీఎం కేసిఆర్ ఆదేశాలు అమలు కావడం లేదని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మరణాలు , కేసులను తగ్గించి చూపిస్తోందని ఆయన ఆరోపించారు. వాస్తవ నివేదికలు ఇవ్వకపోవడం వలన తెలంగాణ కేంద్రం సహాయం పూర్తిగా పొందలేకపోతోందన్నారు. ఈ మేరకు బండి సంజయ్‌ మంగళవారం జూమ్‌ ద్వారా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి సలహాలిచ్చానని సీఎం కేసీఆర్ చెప్పుకోవటం సిగ్గుచేటని విమర్శించారు. అంతర్గత సమావేశ విషయాలు బయటకు చెప్పటం సరైంది కాదని, రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఏమి చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

కింగ్ కోఠి ఆసుపత్రిలో పేషెంట్ల మరణాలకు కారకులు ఎవరని, ఎవరు భాద్యత వహిస్తారని బండి సంజయ్‌ ప్రశ్నించారు. తెలంగాణలో పరిస్థితి అదుపు తప్పిందని, కరోనాతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కాపాడే నిర్ణయాలు తీసుకుంటే సహకరిస్తామని సూచించారు. రంజాన్ పండుగకు ఇచ్చే ప్రాధ్యాన్యత ప్రజల ప్రాణాలకు సీఎం కేసీఆర్ ఇవ్వటం లేదని మండిపడ్డారు. రంజాన్ కంటే ముందు లాక్‌డౌన్‌ పెట్టొద్దని సీఎం కేసీఆర్‌ను ఓవైసీ ఆదేశించారని, రంజాన్ పండుగ తర్వాత రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారని అభిప్రాయపడ్డారు. ఓల్డ్ సిటీలో నైట్ కర్ఫ్యూ అమలు కావటం లేదని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక్క వర్గం కోసమే పనిచేస్తోందని, నిఖార్సయిన హిందువునని చెప్పుకునే కేసీఆర్ ఎందుకు మరో వర్గానికి మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు