‘రాహుల్‌ దేశానికి పెద్ద శత్రువయ్యారు’

13 Feb, 2021 16:19 IST|Sakshi

వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్‌ యూ టర్న్‌ ఎందుకు తీసుకుంది

రాహుల్‌పై మండిపడ్డ నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: రాజ్యాంగ కార్యకర్తలను నిరంతరం అవమానించడమే కాక వివిధ అంశాలపై "నకిలీ కథనాలను సృష్టించడం" ద్వారా రాహుల్‌ గాంధీ భారతదేశానికి అతి పెద్ద శత్రువుగా తయారయ్యారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడుపై విరుచుకుపడ్డారు. లోక్‌సభలో బడ్జెట్‌పై సాధారణ చర్చకు సమాధానమిస్తూ నిర్మలా సీతారామన్..‌ ‘‘రాహుల్‌ గాంధీ నకిలీ కథనాలను ప్రచారం చేయడమే కాక ప్రభుత్వంపై అబద్దపు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కానీ రాహుల్‌ గాంధీకి మాత్రం వినే ఓపిక లేదు’’ అంటూ మండిపడ్డారు.

"కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తోన్న ఈ రెండు ధోరణులను మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన పార్లమెంటరీ వ్యవస్థపై వారికి ఏ మాత్రం నమ్మకం లేదని రాహుల్‌ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతోంది’’ అన్నారు నిర్మలా సీతారామన్‌. ‘‘ప్రస్తుతం చర్చించాల్సిన అంశాలు ఎన్నో ఉండగా.. రాహుల్‌ గాంధీ వాటిని వదిలేసి.. ఒక్క దాన్నే పట్టుకుని వేలాడుతున్నారు. వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్‌ నాయకులు నోరు మెదపడం లేదు. ఎందుకు ఇలా యూ టర్న్‌ తీసుకున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు.

‘‘కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇంతవరకు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించాను. దీనికి ఆయన నుంచి ఎలాంటి సమాధానం లేదు’’ అని నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. రాహుల్‌ గాంధీ దేశాన్ని ముక్కలు చేసే గ్రూపులో చేరారని.. భారతదేశాన్ని కించపరిచే తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

చదవండి: ఊగిపోయిన రాహుల్‌ గాంధీ గది!
              మోదీ మిత్రుల కోసమే సాగు చట్టాలు

మరిన్ని వార్తలు