చరిత్రను ఎట్లా మారుస్తారు? అమిత్‌ షా వ్యాఖ్యలకు నితీశ్‌ కుమార్‌ కౌంటర్‌!

13 Jun, 2022 15:49 IST|Sakshi

పాట్నా: ఎన్డీయే కూటమిలో జేడీయూ వైఖరి ఎప్పుడూ ప్రత్యేకమే. మిత్రపక్షంగా ఉంటూనే.. గ్యాప్‌ను మెయింటెన్‌ చేస్తూ, కూటమి ప్రధాన పార్టీ బీజేపీపై నేరుగా విమర్శలకు దిగుతుంటుంది కూడా. తాజాగా బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌.. బీజేపీ కీలక నేత అమిత్‌ షా వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు.

చరిత్రలో ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. ఎవరైనా దానిని ఎలా మారుస్తారు? ఒకవేళ మారుద్దాం అనుకున్నా. ఎలా మారుస్తారో నాకైతే అర్థం కావడం లేదు. భాష అనేది వేరే అంశం. కానీ, చరిత్రలో ప్రాథమిక అంశాలను మార్చలేరు కదా!. చరిత్ర అంటే చరిత్ర.. అది ఎన్నటికీ మారదు.. ఏం చేసినా కూడా’’ అంటూ బీహార్‌ సీఎం నితీశ్‌ స్పందించారు.

తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. చరిత్రకారులు కేవలం మొఘలుల మీద దృష్టిసారించి.. దేశంలోని మిగతా పాలకుల గొప్పతనం గురించి పుస్తకాల్లో చెప్పలేకపోయారంటూ వ్యాఖ్యానించారు. చరిత్ర అనేది ప్రభుత్వాల మీద ఆధారపడే అంశం ఎంతమాత్రం కాదు. వాస్తవాలకు తగ్గట్లుగా ఉండాలి. కాబట్టి, చరిత్రకారులు ఇప్పటికైనా మేల్కొని.. చరిత్రలో చోటు దక్కని మన పాలకుల వైభవాన్ని గుర్తించి..  చరిత్రను తిరగరాయాలంటూ కోరారు అమిత్‌ షా. ఈ వ్యాఖ్యలను బీహార్‌ సీఎం వద్ద ప్రస్తావించిన మీడియా.. ఆయన స్పందన తెలియజేయాలంటూ కోరింది. ఈ నేపథ్యంలోనే సీఎం నితీశ్‌ కుమార్‌ పైవ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు