‘అదే జరిగితే 2024లో పిక్చర్‌ వేరేలా ఉంటుంది’.. బీజేపీపై నితీశ్‌ విమర్శలు

3 Sep, 2022 17:14 IST|Sakshi

పాట్నా: మణిపూర్‌లో జేడీయూకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరటంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలినట్లయింది. ఈ క్రమంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌. ప్రతిపక్షాలు ఏకమైతే 2024లో పరిస్థితులు మరోస్థాయిలో ఉంటాయన్నారు. శనివారం సాయంత్రం తలపెట్టిన జేడీయూ రాష్ట్ర ప్రతినిధుల సమావేశానికి హాజరయ్యేందుకు మణిపుర్‌ జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారని, అయితే, ఆకస్మికంగా  ఆ మరుసటి రోజునే బీజేపీలో చేరటం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ‘ఇది రాజ్యాంగబద్ధమేనా? కొద్ది నెలల క్రితం వారంతా బిహార్‌కు వచ్చారు. బీజేపీ ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. వారు అనుసరించిన తీరు ఎలాంటిది? దానర్థం ప్రతిపక్షం ఉండకూడదని కోరుకుంటున్నారు. ’ అని ఆరోపించారు. 

మరోవైపు.. జేడీయూ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ అలియాస్‌ లలన్‌ సింగ్‌ సైతం బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ స్వభావం మరోమారు బయపడిందన్నారు. ‘వారితో మేము కలిసి ఉన్నప్పటికీ అరుణాచల్‌ ప్రదేశ్‌లోనూ ఇదే చేశారు. ఇప్పుడు మేము కూటమి నుంచి బయటకి వచ్చేశాం. మరోమారు అలాగే చేశారు. 2024లోనే వారికి సరైన గుణపాఠం లభిస్తుంది. 2024 ఎన్నికలపై భయంతోనే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు. కానీ, ప్రజలు వారిని గమనిస్తూనే ఉన్నారు. బిహార్‌లోనూ ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. ’అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నితీశ్‌కు ఊహించని షాక్.. బీజేపీలో చేరిన జేడీయూ ఎమ్మెల్యేలు..

మరిన్ని వార్తలు