చంద్రబాబు మాకు సవాల్‌ విసరడమేంటి?

5 Aug, 2020 19:26 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కుని సవాల్‌ చేస్తున్నారు. ఆయన మాకు సవాల్ చేయడం ఏమిటి..?. మేమే చంద్రబాబుకు సవాల్‌ చేస్తున్నాం. ఆయనకు ధైర్యం ఉంటే మూడు రాజధానులపై తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. (చంద్రబాబుకు ఎంపీ మిథున్రెడ్డి సవాల్)

తన ఎమ్మెల్యేలు ఓడిపోతారని  రాజీనామా చేయించడానికి భయపడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే చంద్రబాబు తప్ప ఎవరూ గెలవరు. రాజధానిని అమరావతి నుంచి తరలించలేదు. అదనంగా మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది సీఎం జగన్‌ లక్ష్యం. గతంలో కేసీఆర్‌ తెలంగాణవాదం మీద ఉప ఎన్నికలకు వెళ్లారు. చంద్రబాబు ఎందుకు అమరావతిపై ఉప ఎన్నికలకు వెళ్లడానికి భయపడుతున్నారు.’ అని సూటిగా ప్రశ్నలు సంధించారు. (రాజధానులపై చంద్రబాబు డ్రామా)

కాగా ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాజకీయ కుట్రలు పన్నడంలో ఆరితేరిన విపక్ష నేత చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో వితండ వాదనకు దిగిన విషయం తెలిసిందే. మూడు రాజధానులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయడం విదితమే.

మరిన్ని వార్తలు