శివసేన కోసం కొత్త బిల్డింగ్‌ వేట! షిండే క్యాంప్‌ ఏం చెబుతోందంటే..

13 Aug, 2022 15:24 IST|Sakshi

ముంబై: రెబల్‌ ఎమ్మెల్యేల ద్వారా శివసేన పార్టీని విభజించిన ఆ పార్టీ కీలక నేత ఏక్‌నాథ్‌ షిండే.. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో మహారాష్ట్రలో సర్కార్‌ను ఏర్పాటు చేయడం, ఏకంగా సీఎం అయిపోవడం విదితమే. అయితే.. తమదే సిసలైన శివసేన అని ప్రకటించుకున్న షిండే వర్గం.. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు సిద్ధమవుతోందా?

బాలాసాహెబ్‌(బాల్‌థాక్రే)  నేతృత్వంలో స్థాపించిన బడిన శివసేన ప్రధాన కార్యాలయం శివసేన భవన్‌.. దాదర్‌లో ఉంది. ఈ భవనంతో సంబంధం లేకుండా ఓ శివసేన భవనం ఏర్పాటు చేసే ఆలోచనలో షిండే వర్గం ఉన్నట్లు ఊహాగాన కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు దాదర్‌ ప్రాంతంలోనే కొత్త భవనం కోసం వేట ప్రారంభించినట్లు, ప్రధాన కార్యాలయంతో పాటు స్థానిక కార్యాలయాలను సైతం నెలకొల్పే ఆలోచనలో ఉన్నట్లు ఆ కథనాల సమచారం. 

అయితే ఈ కథనాలపై షిండే వర్గం స్పందించింది. తాజాగా షిండే కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణం చేసిన ఉదయ్‌ సామంత్‌ అదంతా ఊహాగానమే అని ప్రకటించారు. కొత్త ప్రధాన కార్యాలయం లాంటి ఆలోచనేం లేదు. బాలాసాహెబ్‌పై ఉన్న గౌరవంతో శివసేన భవనాన్నే మేం గౌరవిస్తాం. కానీ, సీఎం షిండే.. సామాన్యులతో భేటీ కోసం ఓ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మాత్రమే ఉన్నాం.  బహుశా ఈ కథనాలు తెలిసి పొరపాటుగా అర్థం చేసుకుని మీడియా ఇలా ప్రచారం చేస్తుందేమో అని ఉయద్‌ సామంత్‌ వెల్లడించారు. 

ప్రస్తుతం శివ సేన పార్టీ ఎవరికి చెందాలనే వ్యవహారం సుప్రీం కోర్టులో నడుస్తోంది. తమదే అసలైన క్యాంప్‌ అంటూ మాజీ సీఎం ఉద్దవ్‌ థాక్రే, ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్‌ షిండే ‍క్యాంప్‌లు పోటాపోటీ ప్రచారంలో బిజీగా ఉన్నాయి.

చదవండి: మునుగోడు  ఉపఎన్నికపై సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన

మరిన్ని వార్తలు