పంకజా, ప్రీతం మద్దతుదారుల రాజీనామా 

11 Jul, 2021 02:44 IST|Sakshi

ఇరువురికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో అనుచరుల నిర్ణయం 

రాజీనామా చేసిన వారిలో బీడ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు, జిల్లా పరిషత్‌ సభ్యులు

సాక్షి, ముంబై: కేంద్ర మంత్రి మండలి విస్తరణలో స్థానం దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ బీజేపీ ఎమ్మెల్యే పంకజా ముండే, ఎంపీ ప్రీతం ముండేల మద్దతుదారులు సుమారు 20 మందికిపైగా పైగా తమ పదవులకు రాజీనామాలు చేశారు. బీడ్‌ జిల్లాకు చెందిన వీరంతా రాజీనామాలు చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడేక్కింది.  

అసంతృప్తి లేదంటూనే.. 
కేంద్ర మంత్రిమండలి విస్తరణ అనతంరం మంత్రి మండలిలో స్థానం దక్కకపోవడంపై దివంగత సీనియర్‌ బీజేపీ నేత గోపీనాథ్‌ ముండే కూతుళ్లు పంకజా ముండే, ప్రీతం ముండేలు అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమి లేదని ఆ వార్తలన్నీ అవాస్తవమంటూ ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ కొట్టిపడేశారు.

మరోవైపు పంకజా ముండే కూడా విలేకరుల సమావేశం నిర్వహించి ఎలాంటి నిరాశ లేదని, అదేవిధంగా అసంతృప్తి కలగలేదంటూ ఈ వార్తలకు విరామం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ముండే మద్దతుదారులు మాత్రం శనివారం బీజేపీలో తమ పదవులకు రాజీనామాలు చేయడం కలకలం సృష్టించింది. ముఖ్యంగా బీడ్‌ జిల్లా పరిషత్‌ సభ్యురాలు సవితా బడే, పంచాయతి సమితి సభ్యులు ప్రకాష్‌ ఖోడ్కర్, బీజేపీ విద్యార్థి ఆఘాడీ జిల్లా అధ్యక్షుడు సంగ్రామ్‌ బంగార్, బీజేపీ బీడ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు వివేక్‌ పాఖరేతోపాటు డా. లక్ష్మణ్‌ జాధవ్‌ తదితరులు తమ పదవులకు రాజీనామా చేశారు.  

మరిన్ని వార్తలు