Rahul Gandhi: పెరిగింది మంత్రులు, వ్యాక్సిన్లు కాదు!

12 Jul, 2021 09:07 IST|Sakshi

  వ్యాక్సీన్ల కొరతపై మరోసారి రాహుల్‌  విమర్శలు

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు.  ప్రధానంగా దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత, ఇటీవలి కేబినెట్‌ విస్తరణను టార్గెట్‌గా చేసుకుని ఆయన విమర్శలు గుప్పించారు.  దేశంలో మంత్రుల సంఖ్య పెరిగింది కానీ, కోవిడ్ వ్యాక్సిన్లు  కాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా టీకాల గణాంకాల వివరాలను ట్విటర్‌లో రాహుల్‌ షేర్‌ చేశారు.

రోజుకు సగటు టీకాల లెక్కలను వివరిస్తూ, ఇలా అయితే దేశంలో డిసెంబర్ 2021 నాటికి అందరికీ  వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఎలా పూర్తవుతుందనే సందేహాలను ఆయన లేవనెత్తారు. ‘వేర్‌ ఆర్‌ వ్యాక్సిన్‌’ అనే హ్యష్‌ట్యాగ్‌ తో రాహుల్‌ ట్విటర్‌ ద్వారా తన దాడిని ఎక్కుపెట్టారు. దేశంలో వ్యాక్సిన్ల కొరత సమస్యపై ఇప్పటికే అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్, మహమ్మారి థర్డ్‌ వేవ్‌ ఆందోళన నేపథ్యంలో దేశ జనాభాకు త్వరితగతిన టీకాలందించే కార్య్రకమాన్ని మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్‌ తాజా ట్విట్‌ చేయడం గమనార్హం.

కాగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన తరువాత మోదీ తన కేబినెట్‌ను భారీగా విస్తరించిన సంగతి తెలిసిందే. తద్వారా ప్రభుత్వంలో 43 మంది మంత్రులను చేర్చుకోగా మొత్తం మంత్రుల సంఖ్య 77 కి చేరింది.

మరిన్ని వార్తలు