పణజి: పెగసస్ స్పైవేర్ అంటూ వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించి లేవనెత్తే అంశా లేవీ లేకనే ప్రతిపక్షాలు ఇటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్న అంశాలు నిరాశాపూరితాలు, అవి అసలు అంశాలే కావని పేర్కొన్నారు. ఏం చేయాలో తెలియకనే, పార్లమెంట్లో ఇలా అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తు న్నాయని చెప్పారు. అన్ని విషయాలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆదివారం గోవాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలతలో పార్లమెంట్ సమావేశాలు గత రికార్డులను తుడిచిపెట్టాయని చెప్పారు.
ప్రధాని ప్రకటన చేయాలి: చిదంబరం
పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై ప్రధాని మోదీ పార్లమెంట్లో ఒక ప్రకటన చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం డిమాండ్ చేశారు. హ్యాకింగ్ ఆరోపణలపై ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలి లేదా దీనిపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని నియమించాలన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ విజయానికి పెగసస్ స్నూపింగ్ కూడా సాయపడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.