కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు : పద్మారావు

21 Jan, 2021 13:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్వే కార్మికుల సమావేశంలో తెలంగాణ శాస‌న‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారనే విషయాన్ని మరింత స్పష్టం చేశారు. కేటీఆర్‌ సమక్షంలోనే పద్మారావు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సికింద్రాబాద్‌లో నూత‌నంగా నిర్మించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజ‌న‌ల్ కార్యాల‌య ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మంలో పద్మారావు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి కేటీఆర్ కూడా హాజ‌ర‌య్యారు.

ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ.. కార్మికుల తరపున, తెలంగాణ శాసనసభ తరపున కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని ప్రకటించారు. త్వరలోనే ఆయన సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, కేటీఆర్‌కు సీఎం అయ్యే అర్హ‌త‌లు ఉన్నాయ‌ని మంత్రులు గంగుల క‌మ‌లాక‌ర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ రెడ్డి పేర్కొన్న విష‌యం తెలిసిందే.

మరిన్ని వార్తలు