Munugode Bypoll: మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి.. ఆమె స్పందన ఇదే..

9 Sep, 2022 14:10 IST|Sakshi

సాక్షి, నల్గొండ జిల్లా: మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా తనను ఏఐసీసీ ప్రకటించడంతో పాల్వాయి స్రవంతి స్పందించారు. ఆమె ‘సాక్షి’ మీడియాతో ఫోన్‌లో మాట్లాడుతూ, టికెట్‌ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం, సీనియర్‌ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకుంటానన్నారు. సిట్టింగ్ స్థానంలో గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. కార్యకర్తలు కోరుకున్నట్లుగానే అధిష్టానం తనకు టికెట్ ఇచ్చిందన్నారు. అండగా ఉన్న ప్రతీ కార్యకార్తకి ధన్యవాదాలు తెలిపిన ఆమె.. నమ్మకాన్ని నిలబెడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులే తనను మునుగోడులో గెలిపిస్తాయన్నారు.
చదవండి: రేవంత్‌ ఆ వైపు నిలిచినా.. పంతం నెగ్గించుకున్న సీనియర్లు

కాగా, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని మునుగోడు అభ్యర్థిగా కాంగ్రెస్‌ జనరల్‌​ సెక్రటరీ ముఖుల్‌ వాస్నిక్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు టీపీసీసీ నలుగురు అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపించింది. అందులో పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, కైలాష్ నేత, పల్లె రవి పేర్లు ఉన్నట్లు తెలిసింది. వీరిలో కాంగ్రెస్‌ అధిష్టానం పాల్వాయి స్రవంతి వైపే మొగ్గుచూపింది. మునుగోడు నియోజకవర్గంలో మంచి పేరు ప్రతిష్టలు ఉండటం కూడా ఆమెకు కలిసొచ్చింది. గతంలోనూ స్రవంతి అక్కడ నుంచి పోటీచేసి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించారు. 
 

మరిన్ని వార్తలు