సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచలో కుటుంబం సజీవదహనం చేసుకున్న మండిగ రామకృష్ణ నివాసాన్ని మంగళవారం భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ.. ఈ కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ను కఠినంగా శిక్షించాలని, రాఘవ ఎన్ని దురాగతాలు చేసిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.
సంబంధిత వార్త: కుటుంబం ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి పేరు?
కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రామకృష్ణ కూతురిని చూసి చలించిపోయామని అన్నారు. జంతువుల కంటే హీనంగా వనమా రాఘవ ప్రవర్తిస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. వనమా రాఘవను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే షూట్ చేయాలని పొదెం వీరయ్య డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలన్నారు. గతంలో ఎస్ఐ జ్యోతి, మలిపెద్ది వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు కారణం వనమా రాఘవ అని అన్నారు. పోలీసుల ఈ కేసు విషయంలో స్పందించాలని డిమాండ్ చేశారు.