దేశంలో 40 కోట్ల మంది బాహుబలులున్నారు: మోదీ

19 Jul, 2021 11:45 IST|Sakshi

కఠిన ప్రశ్నలు అడగండి.. కానీ సమాధానం చెప్పనివ్వండి

విపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ అభ్యర్థన

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ‘‘విపక్ష ఎంపీలు పదునైన ప్రశ్నలు అడగాలని కోరుకుంటున్నాను. అలానే ప్రభుత్వానికి సమాధానం చెప్పేందుకు తగిన సమయం ఇవ్వాలని ఆశిస్తున్నాను’’ అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా విపక్షాలు ఇంధన ధరల పెంపు, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసన వంటి వివిధ అంశాలపై  ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. "నేను అన్ని పార్టీలు, ఎంపీలు హౌస్‌లో చాలా కష్టమైన, పదునైన ప్రశ్నలను అడగాలని కోరుకుంటున్నాను. కాని క్రమశిక్షణా వాతావరణంలో ప్రభుత్వం స్పందించడానికి అనుమతించాలి. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంచుతుంది, ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది, అభివృద్ధి మార్గాన్ని మెరుగుపరుస్తుంది” అని తెలిపారు. 

కోవిడ్‌ వ్యాక్సిన్‌ మిమ్మల్ని బాహుబలిగా మారుస్తుంది.. కనుక ప్రతి ఒక్కరు టీకా వేసుకోవాలని నరేంద్ర మోదీ అభ్యర్థించారు. అలానే ప్రతి ఒక్కరు కోవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరారు. ‘‘భుజాలకు టీకా తీసున్నవారంతా బాహుబలిగా మారతారు. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా ప్రజలు కనీసం ఒక్క డోస్‌ టీకా అయినా తీసుకుని బాహుబలులుగా మారారు. వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తుంది. దీని గురించి పార్లమెంటులో అర్థవంతమైన చర్చ జరగాలని ఆశిస్తున్నాను’’ అన్నారు మోదీ. 

మరిన్ని వార్తలు