సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: బీజేపీ జాతీయ నాయకులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు కూడా బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. నిన్ననే ఢిల్లీ చేరుకున్న పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్.. బీజేపీ అగ్రనాయకులతో భేటీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు మరికొంత మంది కీలక నేతలతో సమావేశమవుతారని వార్తలు వచ్చాయి. అయితే సాయంత్రం వరకు ఎటువంటి భేటీ జరగలేదు. తిరుపతి లోక్సభ స్థానాన్ని తమకు కేటాయించాలని బీజేపీ అగ్రనాయకులను అడిగేందుకే ఢిల్లీకి పవన్ వచ్చారని ప్రచారం జరుగుతోంది. (చదవండి: బీజేపీ ముందు పవన్ కీలక ప్రతిపాదన!)
తిరుపతిలో బీజేపీనే పోటీ చేస్తుంది: జీవీఎల్
ఇక త్వరలో జరగబోయే తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో బీజేపీనే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతిలో మేమే పోటీ చేస్తాం.. జనసేనకు ఇవ్వమని తెలిపారు.