సాక్షి, న్యూఢిల్లీ: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయి. నవంబర్ 23న ఢిల్లీ వచ్చిన పవన్ బుధవారం సాయంత్రం జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్తో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక విషయంపై చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం రెండు పార్టీల నాయకులతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని భేటీలో నిర్ణయించినట్టు తెలిపారు. నడ్డా ఆహ్వానం మేరకు ఢిల్లీ వచ్చామన్న పవన్ అమరావతి రాజధాని, పోలవరం అంశాలతో పాటు భవిష్యత్లో జనసేన–బీజేపీ పొత్తును ఏ రకంగా బలోపేతం చేయాలనే విషయాలపై చర్చించామని తెలిపారు. అమరావతి రాజధాని విషయంలో చివరి రైతుకూ న్యాయం జరిగే వరకు బీజేపీ–జనసేన రైతులకు అండగా ఉంటాయన్నారు.
జనసేనతో కలిసే పోటీ: జీవీఎల్
తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన, తాము కలిసి పోటీ చేస్తామని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. తిరుపతిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తిరుపతి ఉప ఎన్నికపై బీజేపీ 25 రోజులుగా కసరత్తు చేస్తోందన్నారు.