Saidabad Incident: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? : రేవంత్‌రెడ్డి

15 Sep, 2021 14:49 IST|Sakshi

మద్యం, డ్రగ్స్‌కు అడ్డాగా రాష్ట్రం చేస్తున్నారని ఆగ్రహం

కేసీఆర్‌ మోసాలపై ఫిర్యాదుకు అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌కు విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్ఎస్ ఏడున్నర ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ అవినీతి పెరిగిపోయిందని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే దానిపై ఫిర్యాదు చేసేందుకు అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కోరారు. ఈనెల17వ తేదీన రాష్ట్రానికి వస్తున్న అమిత్ షాను ఎంపీ, ఎమ్మెల్యేలతో తాను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వ్యసనపరులకు స్వర్గధామంగా మారిందని ఆరోపించారు. నూటికి 90 శాతం తాగుబోతులను చేస్తోందని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శించారు. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగానే చూస్తోందని, ఆ మద్యంమత్తులోనే దారుణ సంఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
చదవండి: నాకు లవర్‌ను వెతికి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ వైరల్‌

మహిళలపై జరిగే దాడులకు కారణం మద్యమేనని పోలీసుల రికార్డులు చెబుతున్నాయని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 2021లో ఇప్పటివరకు 1,750 రేప్ కేసులు జరిగాయని వెల్లడించారు. అత్యంత పాశవిక సంఘటనలు జరగడానికి మద్యం, డ్రగ్స్ కారణమని వివరించారు. సింగరేణి కాలనీలో ఘటనపై వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కఠినంగా శిక్షించాలని హోంమంత్రి, డీజీపీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ ఎలా చేశారు? అని ప్రశ్నించారు. ఐదు రోజుల తర్వాత పరారీలో ఉన్నాడని పట్టుకుంటే రూ.10 లక్షల రివార్డు ప్రకటించారని చెప్పారు. అదుపులోనే ఉన్నాడని కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? అని నిలదీశారు. విషసంస్కృతికిపై నిఘా విభాగాలు సీఎం కేసిఆర్ నివేదికలు ఇవ్వడం లేదా? అని ప్రశ్నించారు. డ్రగ్స్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని 9 దర్యాప్తు సంస్థలకు తాను ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వాలు స్పందించకుంటే ప్రజాప్రయోజనాల వాజ్యం వేసినట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు.
చదవండి: ఏపీ సంస్కృతిని ప్రతిబింబించేలా ‘లేపాక్షి’ ఉత్పత్తులు

మరిన్ని వార్తలు