మంత్రి రామచంద్రారెడ్డిని అభినందించిన సీఎం జగన్‌

22 Feb, 2021 12:58 IST|Sakshi

వైఎస్ జగన్ పనితీరుకు ‘పంచాయతీ’ ఫలితాలే నిదర్శనం

సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారు: మంత్రి పెద్దిరెడ్డి 

సాక్షి, తాడేపల్లి: పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందడంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు.

మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ సోమవారం జరిగింది. మున్సిపల్‌ ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ప్రభంజనం సృష్టించారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పనితీరుకు పంచాయతీ ఫలితాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

‘‘ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏదో సాధించాలని చతికిలపడ్డారు. టీడీపీ పునాదులు కదులుతున్నా అసత్య కథనాలు రాయిస్తున్నారు. 80.37 శాతం పంచాయతీలను వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరిగితే 90 శాతానికి పైగా గెలిచేవాళ్లం. సీఎం జగన్ సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారు. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టేలా ఫలితాలు వచ్చాయి. కుప్పం ఫలితాలే చంద్రబాబుపై వ్యతిరేకతకు నిదర్శనం. మున్సిపల్ ఎన్నికల్లో ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని’ మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: టీడీపీ బరితెగింపు: మాకే ఎదురు నిలబడతారా..
నేనే చూసుకుంటా.. నేతలకు బాబు ఫోన్లు..!

 

మరిన్ని వార్తలు