బాబు విషప్రచారాల బాటలోనే లోకేష్‌ 

1 Sep, 2020 06:29 IST|Sakshi

ఎవరో దాడి చేసిన ఘటనను నాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం 

సాక్షి, అమరావతి: అబద్ధాలు, విషప్రచారాలు, ఆధారాల్లేని ఆరోపణలతో రాజకీయంగా ఎదిగిన చంద్రబాబు తన కొడుకును కూడా అదే దారిలో నడిపిస్తున్నారని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. చిత్తూరులో ఒకరి ఇంటిపై కొందరు వ్యక్తులు దాడిచేసిన ఘటనను తనపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పరనిందలు, ఆధారాల్లేని ఆరోపణలతో లోకేష్‌ ట్వీట్లు మీద ట్వీట్లు పెట్టి ఆయన నైజమేంటో ఆయనే చెప్పుకుంటున్నారని అన్నారు.  

► ఒక చిన్నారిని లైంగికంగా వేధించిన కేసులో ఒక హెడ్‌మాస్టర్‌పై చట్టప్రకారం చర్య తీసుకున్నారు. ఈ వ్యవహారంలో పత్రికా విలేకరి వ్యవహారం నడపాలని చూస్తే ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహించి దాడికి దిగారు. పోలీసులు చర్య తీసుకుని, దాడికి దిగిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారాన్ని నాపై రుద్దడం అవివేకం. 
► మీ తండ్రి ఎలాంటి రాజకీయాలు చేశారో, దాని ఫలితం ఏంటో ఇవాళ చూస్తున్నావు లోకేష్‌. నువ్వు కూడా అలాంటి రాజకీయాలే చేస్తున్నావు. ఇలాంటి విష రాజకీయాలు చేస్తే ప్రజలు చెప్పులతో కొట్టే రోజు వస్తుంది. ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే.. తండ్రీ కొడుకులిద్దరికీ ప్రజలు బడితెపూజ చేస్తారు. చంద్రబాబే కాదు.. లోకేష్‌ బుర్రకూడా విషంతో నిండిపోయింది. వీరిద్దరి వ్యవహారశైలి ఈ రాష్ట్రానికి శాపం.

మరిన్ని వార్తలు