తిరుపతిలో అత్యధిక మెజార్టీ సాధిద్దాం

5 Apr, 2021 05:44 IST|Sakshi

రోడ్‌ షోలో మంత్రి పెద్దిరెడ్డి

చిల్లకూరు: తిరుపతి ఉప ఎన్నికల్లో ఢిల్లీ స్థాయిలో చర్చ జరిగేలా మెజార్టీ సాధిద్దామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలునిచ్చారు. పార్లమెంట్‌ అభ్యర్థి గురుమూర్తితో కలిసి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో ప్రచారం, రోడ్‌ షో నిర్వహించారు. వరగలి క్రాస్‌ రోడ్డు నుంచి మోమిడి వరకు సాగిన రోడ్‌ షోలో అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. అంకులపాటూరులో ఏఎంసీ చైర్మన్‌ నల్లారెడ్డి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగసభలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాధికారం ధనవంతులదే కాదని, పేదలదని సీఎం పేద కుటుంబాల్లో వారిని ఎంపిక చేసి వారికి పార్టీ టికెట్లు ఇచ్చి ఉన్నతస్థాయి కల్పిస్తున్నారని, ఇందుకు గురుమూర్తి నిదర్శనమని పేర్కొన్నారు.  

డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. తాను, చంద్రబాబు ఒకచోటే చదువుకున్నామని, అతడికి రెండెకరాల పొలం మాత్రమే ఉండేదని చెప్పారు. అలాంటి వ్యక్తి ఈ రోజు లక్షల కోట్లు సంపాదించి జగన్‌ని వ్యక్తిగతంగా విమర్శిస్తుంటే ప్రజలే సహించడం లేదన్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తికి దేశ చరిత్రలో చెప్పుకొనేలా మెజార్టీ ఇవ్వాలని కోరారు. మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ అందరూ సైనికుల్లా పనిచేసి భారీ మెజార్టీ సాధించాలన్నారు. రాజమండ్రి ఎంపీ భరత్‌ మాట్లాడుతూ బీజేపీ మరో తోక నాయకుడిని చేర్చుకుని ప్రచారం చేసుకుంటోందనివిమర్శించారు. గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి మాట్లాడుతూ అత్యధిక మెజార్టీకి అందరూ కృషిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్, రాప్తాడు ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

>
మరిన్ని వార్తలు