తిరుపతిలో బంపర్‌ మెజార్టీ సాధిస్తాం

29 Mar, 2021 05:09 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి, తదితరులు

సీఎం జగన్‌ చేస్తున్న సంక్షేమాభివృద్ధే ఫలితాన్ని నిర్దేశిస్తుంది

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌(చిత్తూరు జిల్లా): తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో ప్రజా తీర్పు ఏకపక్షంగా ఉంటుందని.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి బంపర్‌ మెజార్టీ సాధిస్తారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సీఎం జగన్‌ చేస్తున్న సంక్షేమాభివృద్ధే ఫలితాన్ని నిర్దేశిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం తిరుపతిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో మంత్రి పెద్దిరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నామని.. ప్రజలు కూడా వాడవాడలా వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.

ఇందుకు సీఎం జగన్‌ పరిపాలనే  కారణమన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించి.. అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని కొనియాడారు. దేశం యావత్తూ రాష్ట్రం వైపు చూసేలా తిరుపతి పార్లమెంట్‌ ఫలితం ఉంటుందన్నారు. కుప్పం రెస్కో స్వయం ప్రతిపత్తిగల సంస్థ అని.. దానిని ఏపీ ట్రాన్స్‌కోలో ఎట్టి పరిస్థితిలోనూ విలీనం చేయబోమన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, తిరుపతి పార్లమెంట్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు భూమన, శ్రీనివాసులు, చెవిరెడ్డి, చింతల, కె.ఆదిమూలం, ఎంఎస్‌ బాబు, వెంకటే గౌడ,ద్వారకనాథ్‌రెడ్డి, నవాజ్‌ బాషా పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు