-

ఎమ్మెల్సీలుగా జకియా, సురేష్‌ ప్రమాణ స్వీకారం

7 Oct, 2020 05:50 IST|Sakshi
మండలి చైర్మన్‌ షరీఫ్‌ సమక్షంలో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తున్న జకియా ఖానం. చిత్రంలో డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, అంజాద్‌ బాషా, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, సురేష్‌ తదితరులు.

శాసనమండలిలో పదికి పెరిగిన వైఎస్సార్‌సీపీ బలం

పార్టీని నమ్ముకున్న వారిని వైఎస్‌ జగన్‌ గౌరవించారు: సజ్జల

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన జకియా ఖానమ్, పెనుమత్స సూర్యనారాయణరాజు (సురేష్‌) మంగళవారం పదవీ ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరి చేత ఉదయం 11 గంటలకు మండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ తన చాంబర్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. దైవసాక్షిగా వారు పదవీ స్వీకారం చేశారు. దీంతో మండలిలో వైఎస్సార్‌సీపీ బలం 10కు చేరుకుంది. ఈ సందర్భంగా లెజిస్లేచర్‌ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు, ఉపముఖ్యమంత్రులు షేక్‌ అంజాద్‌బాషా, పి.పుష్పశ్రీవాణి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కిలారు రోశయ్య, జోగి రమేష్, బి.అప్పలనాయుడు, బూడి ముత్యాల నాయుడు, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి హాజరయ్యారు.

ఎమ్మెల్సీల పదవికి ఎంపికలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని నమ్ముకున్న వారిని కచ్చితంగా గౌరవిస్తామనే సంకేతాన్ని ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో అన్నారు. దేశ చరిత్రలోనే ఒక ముస్లిం మైనారిటీ మహిళను తొలిసారి శాసనమండలికి పంపిన ఘనత వైఎస్‌ జగన్‌దే అన్నారు. అలాగే, తొలి నుంచీ పార్టీని వెన్నంటి ఉన్న పెనుమత్స కుటుంబం నుంచి సురేష్‌కు సముచిత స్థానం ఇచ్చారన్నారు. మైనారిటీ మహిళలు రాజకీయంగా ఎదగాలి అనే ఉద్దేశంతో జకియా ఖానమ్‌ను ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి జగన్‌ ఎంపిక చేశారని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాష అన్నారు. మైనారిటీ మహిళకు వైఎస్‌ జగన్‌ సముచిత స్థానం కల్పించారని మరో ఉపముఖ్యమంత్రి పి.పుష్పశ్రీవాణి ప్రశంసించారు. తనను ఎమ్మెల్సీగా చేసినందుకు తాము వైఎస్సార్‌ కుటుంబానికి రుణపడి ఉంటానని జకియాఖానమ్‌ అన్నారు.   

మరిన్ని వార్తలు