నామినేషన్‌ వేసిన పెన్మత్స సురేష్‌ బాబు

13 Aug, 2020 14:46 IST|Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేష్‌ బాబు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. (విధేయతకు పట్టం)

ఈ సందర్భంగా పెన్మత్స సురేష్‌ బాబు మాట్లాడుతూ అందరినీ కలుపుకుని పార్టీకి మంచిపేరు తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీకి విధేయుడిగా ఉంటానని, చెడ్డపేరు తీసుకురానని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... పెన్మత్స సాంబశివరావు వారసుడుగా సురేష్‌ బాబు పార్టీకి విధేయుడుగా ఉన్నారన్నారు.

కాగా, రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి దివంగత నేత పెన్మత్స సాంబశివరాజు తనయుడు సురేష్‌ బాబు పేరును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేసిన విషయం విదితమే. ఇప్పటికే ఈ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయింది. నామినేషన్‌ దాఖలుకు ఈ నెల 13వ తేదీ ఆఖరు. ఈ నెల 24న ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఈ స్థానం సంఖ్యాపరంగా వైఎస్సార్‌సీపీకే దక్కనుంది. టీడీపీ బరిలో నిలిచే అవకాశం కూడా పెద్దగా లేనందున సురేష్‌ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు