చంద్రబాబు ఓ పిరికిపంద: పేర్ని నాని

11 Feb, 2023 16:50 IST|Sakshi

సాక్షి, అమరావతి: విషపు రాతలతో చంద్రబాబు ఒక పుస్తకం అచ్చు వేయించాడని, దానిపై తన పేరు కూడా వేసుకోలేని పిరికిపంద చంద్రబాబు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘పుస్తకంపై ఎక్కడా టీడీపీ పేరు లేదు. ఇవన్నీ అసత్యపు రాతలు కాబట్టే పేరు వేసుకునే ధైర్యం లేదు. అచ్చెన్నాయుడికి బాడీ తప్ప బుర్ర ఉండదు’’ అంటూ దుయ్యబట్టారు.

‘‘వివేకా హత్య సమయంలో ఎవరి ప్రభుత్వం ఉంది?. అప్పుడు మీరేం చేశారు. వివేకా భార్య, కుమార్తె, అల్లుడిని ఎందుకు విచారించలేదు. ఊళ్లో ఉన్న కుటుంబాన్ని ఎందుకు విచారించలేదు?. వివేకా కుమార్తె చెప్పిన అంశాలపై ఎందుకు విచారణ జరపలేదు?. ఎన్టీఆర్‌ మరణానికి కారణం చంద్రబాబు కదా?. ఎన్టీఆర్‌ మరణంపై కూడా ఒక పుస్తకం వేయించాలి. కోడెల శివప్రసాద్‌ మరణంపై సీబీఐ దర్యాప్తు ఎందుకు అడగలేదు. ఇటీవల ఎన్టీఆర్‌ కుమార్తె మరణంపై పుస్తకం ఎందుకు వేయలేదు’’ అని పేర్ని నాని ప్రశ్నించారు.

‘‘అవినాష్‌రెడ్డి సీబీఐకి స్టేట్‌మెంట్‌ ఇచ్చాడంటూ చంద్రబాబు ఎలా చెబుతాడు?.  సీబీఐ దగ్గర అవినాష్‌ చెప్పిన విషయాలు మీకు ఎలా తెలుసు?. సీబీఐ అధికారుల్లో చంద్రబాబు మనుషులు ఉన్నారా?. చంద్రబాబు డైరెక్షన్‌లో సీబీఐ నడుస్తుందా?. వివేకా హత్యపై టీడీపీ ప్రభుత్వంలో ఎందుకు ఛార్జ్‌షీట్‌ వేయలేదు?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.

‘‘చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్‌ను దెబ్బతీయలేరు. రాజకీయాల కోసం ఇంట్లో ఆడవాళ్లను బజారున పెడతావు. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా చేసింది ఎవరు?. రాజకీయాల కోసం మహిళలను బజారుకీడ్చే సంస్కృతి చంద్రబాబుది. ఇళ్లలో ఉన్న మహిళల ఫొటోలను పుస్తకంలో వేస్తారా?. మీ ఇంట్లో వారే మహిళలా? వేరే ఇళ్లలో ఉన్నవారు మహిళలు కాదా?. చంద్రబాబుది అతి నీచమైన, దుర్మార్గమైన సంస్కృతి. చంద్రబాబు లాంటి నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి ఎక్కడా ఉండడు’’ అంటూ  పేర్ని నాని నిప్పులు చెరిగారు.
చదవండి: పాదయాత్రల్లో బ్యాలెన్స్‌ తప్పుతున్న నేతలు


 

మరిన్ని వార్తలు