అభివృద్ధిని అడ్డుకోవడానికే బాబు పాపపు సొమ్ము ఖర్చు

17 Sep, 2021 02:24 IST|Sakshi

సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను అడ్డుకుని, వాటి ఫలాలను ప్రజలకు దక్కనివ్వకుండా చేసేందుకు ప్రతిపక్షనేత చంద్రబాబు దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అడ్డగోలుగా దోచేసిన పాపపు సొమ్మును ఢిల్లీలో ప్రఖ్యాత ప్లీడర్లకు తగలేసి.. కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారన్నారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వ్యవస్థల్లో లోపాలను అడ్డం పెట్టుకుని.. ప్రజా తీర్పును అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేశారని ధ్వజమెత్తారు.

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే నేరాల శాతం తగ్గిందని చెప్పారు. టీడీపీ పాలనా కాలంతో పోలిస్తే 15 నుంచి 20 శాతం నేరాలు తగ్గాయన్నారు. ఆడపిల్లలు, మహిళల రక్షణ కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మకంగా దిశ చట్టాన్ని తెచ్చారని గుర్తు చేశారు. జాతీయ పార్టీగా చెప్పుకునే టీడీపీ పక్క రాష్ట్రంలో కూడా ఉందని, అక్కడ ఏం జరుగుతోందో అందరికీ తెలుసని అన్నారు. అక్కడ మాత్రం ఆ జాతీయ పార్టీ ఎందుకు నోరు మెదపదని నిలదీశారు. మహిళలు, ఆడ పిల్లలపై ఏదైనా దాడి జరిగితే మానవత్వం ఉన్న మనిషిగా ఖండించాల్సిందిపోయి.. దగాకోరు రాజకీయాలు చేస్తున్న మానవ మృగం చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఏ రంగంలోనైనా సమ ఉజ్జీ ఉంటే పోటీ బాగుంటుందని, కానీ.. రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌కు రాజకీయ ప్రత్యర్థిగా సమ ఉజ్జీ లేదన్నారు.  సీఎం జగన్‌పై నిత్యం విషం చిమ్ముతూ వికృత రాజకీయాలు చేసే మానవ మృగం చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థిగా ఉండటం శోచనీయమన్నారు.  

మరిన్ని వార్తలు