జనసేన మచిలీపట్నం సభలో జరగబోయేది ఇదే: పేర్ని నాని

14 Mar, 2023 09:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు కోసమే పవన్‌ జనసేన పెట్టారని మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ, వైఎస్‌ జగన్‌ను తిట్టేందుకే ఆవిర్భావ సభ పెడుతున్నారని, సీఎంను తిట్టడమే తప్ప వారికి వేరే అజెండా లేదని మండిపడ్డారు.

‘మనం ఏం చేశాం.. మనలో లోపాలేంటి అనేది చర్చించుకోవడం రాజకీయపార్టీ లక్షణం. కానీ చంద్రబాబు సేవ కోసమే పవన్ రాజకీయ పార్టీ పెట్టాడు. తన పార్టీని అభిమానించే వారందరినీ చంద్రబాబుకు ఓటేయమంటున్నాడు పవన్‌. చంద్రబాబు మేలు కోసమే పవన్ పని చేస్తున్నాడు. ఇప్పటం సభకు.. మచిలీపట్నం సభకు పెద్ద తేడా ఉండదు’’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

‘‘సీఎం జగన్‌ను, కాపు నాయకులను దూషించడమే పవన్ పని. మచిలీపట్నం సభలో జరగబోయేది ఇదే. మచిలీపట్నంలో జరగబోయేది ఆవిర్భావ సభ కాదు అస్మదీయ దూషణ సభ. కాపులను చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికే పవన్ తాపత్రయం. పవన్ ఎప్పటికీ మారడు. సినిమాలు ప్లాప్ అయితే నష్టాలొస్తాయి. కానీ ప్లాప్ అయిన సినిమాకు కూడా పవన్‌కు లాభాలొచ్చేది ఇక్కడే. ప్యాకేజీ స్టార్ అంటే పవన్‌కు కోపం వస్తుంది. ఏబీఎన్ రాధాకృష్ణ వెయ్యి కోట్ల స్టార్ ప్యాకేజ్ అంటే ఆనందపడుతున్నాడు’’ అంటూ పేర్ని నాని చురకలు అంటించారు.
చదవండి: ‘మార్గదర్శి’ అక్రమాలు: ఇదో పోంజీ తరహా స్కామ్‌.. చందాదారుల సొమ్ముతో దందా!

మరిన్ని వార్తలు