టీడీపీ మాక్ అసెంబ్లీ..అదో సుర‌భి డ్రామా కంపెనీ: పేర్ని నాని

20 May, 2021 20:55 IST|Sakshi

సాక్షి, అమరావతి:  టీడీపీ నిర్వహిస్తున్న మాక్‌ అసెంబ్లీని చూస్తుంటే సురభి డ్రామా కంపెనీ గుర్తొస్తుందని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. టీడీపీ నిర్వహించే మాక్ అసెంబ్లీలో మహా నటులు కన్పిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎస్వీఆర్, నాగభూషణం, సావిత్రి వంటి నటులు మాక్ అసెంబ్లీలో కన్పిస్తున్నారని సెటైర్లు వేశారు. టీడీపీ మాక్ అసెంబ్లీని చూసి తమకు వినోదాన్ని పంచేందుకు మరో డ్రామా కంపెనీ వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

గ్లోబల్ టెండర్లల్లో తప్పులుంటే టీకా ఉత్పత్తి కంపెనీలు చెప్పాలి. కానీ చంద్రబాబు, లోకేష్ ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని మండిపడ్డారు. టీకా ఉత్పత్తి కంపెనీల్లో చంద్రబాబుకు ఏమన్నా వాటాలున్నాయా అని ప్రశ్నించారు. గ్లోబల్ టెండర్లల్లో పాల్గొనేందుకు టీకా కంపెనీలు సిద్దంగా ఉంటే చంద్రబాబుకు వచ్చిన ఇబ్బందేమిటని నిలదీశారు. బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశామని, సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి మరీ ప్రజలకు సంక్షేమం అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

తొలిసారి జెండర్ బడ్జెట్, పిల్లల బడ్జెట్, మైనార్టీల బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఎస్సీ, బీసీ సబ్ ప్లాన్ తరహాలో జెండర్, పిల్లలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాం. కాపు నేస్తం పథకాన్ని చెప్పిన దానికంటే మిన్నగా అమలు చేస్తున్నాం. అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. కరోనా కష్టకాలంలో ఆర్ధిక ఇబ్బంది లేకుండా ఆహార భద్రత కల్పిస్తున్నాం. చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా మేం తీరుస్తున్నాం. రూ. 31 వేల కోట్లతో ఆస్తుల కల్పనకు నిర్ణయించాం’ అని మంత్రి తెలిపారు.

చదవండి: సీఎం జగన్‌ అప్యాయంగా పలకరించారు: మండలి చైర్మన్‌

మరిన్ని వార్తలు