యాదాద్రి నిర్మించినట్లే.. భద్రాద్రిని ఎందుకు అభివృద్ధి చేయలేదు: పేర్నినాని

19 Jul, 2022 18:35 IST|Sakshi

సాక్షి,విజయవాడ: పోలవరం డ్యామ్ వల్ల భద్రాచలం మునిగిందనడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఆంధ్రా సెగ రాజేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరద డిశ్చార్జి అవుతుందని, ప్రస్తుతం వచ్చిన వరద కేవలం 28 లక్షల క్యూసెక్కులు మాత్రమేనని తెలిపారు. తెలంగాణ వారే ఏపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆధార్‌ కార్డులను ఏపీ అడ్రస్‌తో మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

1986లో పోలవరం లేదని, అప్పుడు భద్రాచలం మునగలేదా అని ప్రశ్నించారు. అవగాహన లేకుండా పువ్వాడ అజయ్‌ మంత్రి ఎలా అయ్యారోనని సందేహం వ్యక్తం చేశారు. మంథని, ఏటూరు నాగారం ప్రాంతాలు కూడా మునిగిపోయాయని, ఆ ప్రాంతాలను ఎక్కడ కలుపుతారని పేర్ని నాని ప్రశ్నించారు. 1953లో భద్రాచలం ఏపీలోనే ఉండేదని గుర్తు చేశారు. భద్రాద్రిపై తెలంగాణ సవితి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. యాదాద్రి నిర్మించినట్లే.. భద్రాద్రిని ఎందుకు అభివృద్ధి చేయలేదని నిలదీశారు.
చదవండి: పోలవరం ఎత్తుపై కొత్త వివాదాన్ని సృష్టించొద్దు: మంత్రి అంబటి

తెలంగాణ ప్రభుత్వానికి భద్రాచలంపై ప్రేమ లేకుంటే ఏపీకి ఇచ్చేయాలని, తాము అభివృద్ధి చేసుకుంటామన్నారు. కేవలం ఎన్నికల కోసమే తెలంగాణ నేతలు, మంత్రి పువ్వాడ పోలవరం డ్యాం గురించి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌ పదేళ్లు ఉమ్మడి రాజధానేనని ప్రస్తావించిన పేర్ని నాని.. చంద్రబాబు చేసిన తప్పు వల్ల హైదరాబాద్‌ను వదులుకోవాల్సి వచ్చిందన్నారు. 
చదవండి: పువ్వాడ అనవసర విమర్శలు మానుకోవాలి: బొత్స

మరిన్ని వార్తలు