అది దూషణల సభ

15 Mar, 2023 04:52 IST|Sakshi

చంద్రబాబు సేవ కోసమే పవన్‌ పార్టీ పెట్టాడు.. ఇప్పటం సభకు, బందరు సభకు తేడాలేదు

కాపులను బాబు దగ్గర తాకట్టు పెట్టడానికే పవన్‌ తాపత్రయం

జనసేన ఆవిర్భావ సభపై మాజీ మంత్రి పేర్ని నాని

సాక్షి, అమరావతి: జనసేన సభ కేవలం చంద్రబాబు, పవన్‌ల తస్మదీయ దూషణల సభ మాత్రమేనని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మనం ఏం చేశాం, మన లోపాలేంటి అనేది చర్చించు­కోవడం రాజకీయ పార్టీ లక్షణమని.. కానీ, చంద్ర­బాబు సేవ కోసమే పవన్‌ రాజకీయ పార్టీ పెట్టాడని ఆయన ఆరోపించారు.

తన పార్టీని అభిమానించే వారందరినీ చంద్రబాబుకు పవన్‌ ఓటేయమంటున్నారని, చంద్రబాబు మేలు కోసమే పవన్‌ పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.

ఇప్పటం సభకు, మచిలీపట్నం సభకు పెద్ద తేడాలేదని, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని, తనను, కాపు నాయకులను దూషించడమే పవన్‌ పని అని ఆయన తేల్చిచెప్పారు. వైఎస్సార్‌సీపీలో ఉన్న కాపు నేతలను అడ్డగోలుగా బూతులు తిట్టడానికే పవన్‌ సభ పెట్టారని నాని అన్నారు. కాపులను చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికే పవన్‌ తాపత్రయపడుతున్నారని, పవన్‌ ఎప్పటికీ మారడని పేర్ని తేల్చిచెప్పారు.

సాధారణంగా సినిమాలు ప్లాప్‌ అయితే నష్టాలొస్తాయని.. కానీ, ఫ్లాప్‌ అయిన సినిమాకు కూడా పవన్‌కు లాభాలొచ్చేది ఈ సభలోనేనన్నారు. ప్యాకేజ్‌ స్టార్‌ అంటే పవన్‌కు కోపమొస్తుందని, ఏబీఎన్‌ రాధాకృష్ణ వెయ్యికోట్ల స్టార్‌ ప్యాకేజ్‌ అంటే ఆనందపడుతున్నాడని ఎద్దేవా చేశారు.   

మరిన్ని వార్తలు