ప్రధాని మోదీపై వైరల్‌గా మారిన రాహుల్‌ సెటైర్లు

12 May, 2021 07:50 IST|Sakshi

వాటితో సెంట్రల్‌ విస్టా మినహా మరేమీ కనిపించదు

ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ సెటైర్లు

ప్రజల ఇబ్బందులు తీర్చాలని వినతి

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌–19తో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మోదీ ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. రంగుల కళ్లద్దాలు తీసేసి ప్రజల కష్టాలు చూడాలని ప్రధాని మోదీకి సలహా ఇచ్చారు. ఆ కళ్లద్దాలు పెట్టుకుంటే సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు తప్ప మరేదీ కనిపించదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌కు కొత్త భవనం, ప్రధానమంత్రికి కొత్త నివాసం నిర్మాణం వంటి వాటికి వెచ్చించే డబ్బును దేశంలో వైద్య సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనకు వెచ్చించాలని డిమాండ్‌ చేశారు.

‘లెక్కలేనన్ని మృతదేహాలు నదుల్లో కొట్టుకు వస్తున్నాయి. ఆస్పత్రుల వద్ద మైళ్ల పాడవున క్యూలు ఉంటున్నాయి. ప్రజల జీవించే హక్కును లాగేసుకున్నారు. ప్రధాని మోదీ, తన లేత రంగు కళ్లద్దాలను తీసి చూడాలి. వాటిని ధరిస్తే ఆయనకు సెంట్రల్‌ విస్టా తప్ప మరేదీ కనిపించదు’అని మంగళవారం రాహుల్‌ ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు. ఈ కష్ట సమయంలో అవసరాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్లు, టీకాల కొరత, ప్రజలు వాటికోసం పడుతున్న ఇబ్బందులతో కూడిన వీడియోను పోస్ట్‌ చేశారు. కోవిడ్‌ బాధితులకు సాయ పడేందుకు  కాంగ్రెస్‌ పార్టీ కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసింది.

చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ

చదవండి: ఆవు పేడతో కరోనా అస్సలు తగ్గదు.. వేరే సమస్యలు వస్తాయి
 

మరిన్ని వార్తలు