ప్రధాని మోదీ ఇండైరెక్ట్‌, షా డైరెక్ట్‌ ఎటాక్‌.. క్రెడిట్‌ తీసుకోరేం అంటూ మాజీ సీఎంకు ప్రశ్న

28 Dec, 2021 18:53 IST|Sakshi

PM Modi And Amit shah Slams SP Chief Akilesh Yadav Over Piyusj Jain Issue: యూపీ కాన్ఫూర్‌ వ్యాపారి పీయూష్‌ జైన్‌ వ్యవహారం ఆర్థిక నేరంగానే కాదు.. రాజకీయంగానూ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ అత్తరు వ్యాపారి అయిన పీయూష్‌ నుంచి దాదాపు 200 కోట్లకు పైనే విలువైన సంపదను అధికారులు రికవరీ చేసుకోవడంతో పాటు వెయ్యి కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.  ఈ తరుణంలో యూపీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. పీయూష్‌ వ్యవహారం ఆధారంగా ప్రతిపక్షంపై విమర్శలు ఎక్కుపెట్టారు. 


కాన్పూర్‌లో మంగళవారం మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ ఆవిష్కరణ సందర్భంగా ప్రసంగించిన ప్రధాన మోదీ.. సమాజ్‌వాదీ పార్టీ, ఆ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌పై పరోక్షంగా సెటైర్లు విసిరారు. బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేసినా.. అది తాము చేసిందేనని, బీజేపీ క్రెడిట్‌ను ఊరికే లాక్కుంటోందని వాళ్లు(అఖిలేష్‌ను ఉద్దేశించి) అంటారు కదా. మరి ఇప్పుడు నోట్ల కట్టలు నిండిన డబ్బాలు బయటపడ్డాయి. మరి బాధ్యతగా ఎందుకు ముందుకు రావడం లేదు. నోళ్లు మూసుకుని కూర్చుకున్నారు వాళ్లంతా.  2017కి ముందు దాకా అత్తరు అవినీతి యూపీలో ఏ విధంగా గుభాలించిందో అందరికీ తెలిసిందే అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 

దేశం మొత్తం ఈ వ్యవహారాన్ని ఆసక్తిగా చూస్తోంది. ఇది వాళ్లు సాధించిన ప్రగతి. వాస్తవ పరిస్థితి. యూపీ ప్రజలు ప్రతీది గమనిస్తున్నారు. వాళ్లకు ప్రతీది అర్థమవుతోంది. గత ప్రభుత్వం ఎన్నికల గెలుపును.. దోచుకునేందుకు దొరికిన లాటరీగా భావించింది. కానీ, బీజేపీ ప్రభుత్వం నిజాయితీతో బాధ్యతాయుతంగా పని చేస్తోందని అని వ్యాఖ్యానించారు ప్రధాని. 

షా నేరుగా.. 
అయితే ప్రధాని మోదీ పరోక్షంగా కామెంట్స్‌ చేస్తే.. కేంద్ర మంత్రి అమిత్‌ షా నేరుగా పేర్లతో విమర్శించడం విశేషం. ఈమధ్య సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ పర్‌ఫ్యూమ్‌ వ్యాపారి దొరికాడు. మేమేందుకు దాడులు చేయించామా? అనుకుంటూ అఖిలేష్‌ గారు మెలికలు తిరిగిపోతున్నారు. 250కోట్ల డబ్బు. ఎక్కడిది అఖిలేష్‌గారూ అంటూ సూటిగా ప్రశ్నించారు షా. 

అఖిలేష్‌ ఏమన్నాడంటే..
ఇక ప్రధాని, షాల ఆరోపణలపై ఎస్పీ చీఫ్‌, మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ సాదాసీదాగా స్పందించాడు.  పొరపాటున వాళ్లకు చెందిన వ్యాపారిపైనే బీజేపీ దాడులు చేయించుకుందంటూ కౌంటర్‌ ఇచ్చారు. అతని(పీయూష్‌) కాల్‌ రికార్డులు పరిశీలిస్తే.. అతనితో టచ్‌లు ఉన్న బీజేపీ నేతల పేర్లు బయటపడతాయి. ఎస్పీ నేత పీయూజ్‌రాజ్‌ జెయిన్‌కు బదులు.. బహుశా పీయూష్‌ జైన్‌ మీద దాడులు చేసి ఉంటారేమో అంటూ సెటైరిక్‌గా స్పందించారు అఖిలేశ్‌.

మరిన్ని వార్తలు